Bihar : బిహార్లో రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ఏకంగా 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కూలిన బ్రిడ్జిల స్ధానంలో నూతన వంతెనల పునర్నిర్మాణానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దోషులుగా తేలిన కాంట్రాక్టర్ల నుంచి పునర్నిర్మాణ ఖర్చును రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫ్లయింగ్ స్వాడ్స్ తమ నివేదికలను సమర్పించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. బ్రిడ్జిలు కూలిన ఘటనల వెనుక ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ముఖ్య కారణాలని నివేదిక స్పష్టం చేసింది. ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ కొరవడటం ఫలితంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ ఆరోపించారు.
కాగా, బిహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. ఆర్జేడీ వ్యవస్ధాపక దినం సందర్భంగా శుక్రవారం తేజస్వి మీడియాతో మాట్లాడారు. పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
బిహార్లో విచ్చలవిడిగా నేరాలు పెచ్చుమీరాయని అన్నారు. పేపర్ లీక్ ఘటనలూ వెలుగుచూశాయని తేజస్వి యాదవ్ చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ ఈ విషయాలపై మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ అంశాల గురించి మాట్లాడితే తేజస్వినే ఇదంతా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Niranjan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి