Hathras Stampede | ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మంగళవారం జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకున్నదని అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడారు.
హత్రాస్ తొక్కిసలాటలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని సీఎం యోగి ఆదిత్య నాథ్ కు అమిత్ షా హామీ ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటన పూర్వాపరాలను హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం త్వరలో హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అంతకు ముందు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయ పడిన వారు త్వరితగతిన కోలుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్ కు వెళ్లనున్నారు. హత్రాస్ వద్ద మంగళవారం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 116 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్వాపరాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్, డీజీపీ ప్రశాంత్ కుమార్లను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఏడీజీ ఆగ్రా, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు, సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన నివాసంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముగ్గురు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో అనునిత్యం సంప్రదిస్తున్నారని ఓ అధికారి చెప్పారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.