ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. తాము నమ్మే గురువు పాదాలను తాకే ప్రయత్నంలో అమాయక భక్తులు ప్రాణాలు విడిచారు. తొక్కిసలాటలో చిక్కుకొని వందలాది మంది విలవిల్లాడారు. అనేక మంది దవాఖానల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, గాయపడ్డ వారి హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది.
హత్రాస్, జూలై 2: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో ఆధ్యాత్మిక కార్యక్రమం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. 116 మంది మరణాలకు కారణమైంది. భోలే బాబా అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో మంగళవారం ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
పోలీసులు, స్థానికులు ఈ ఘటన నుంచి తేరుకొని సహాయక చర్యలు ప్రారంభించేటప్పటికీ తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. 89 మంది ఘటనా స్థలంలో విగతజీవితులగా పడి ఉన్నారు. గాయపడ్డ వారిని ట్రక్కులు, టెంపోల్లో స్థానికంగా ఉన్న సికందర రావు ట్రామా సెంటర్ దవాఖానకు తరలించారు. వీరిలోనూ మరో 27 మంది మరణించారు. మొత్తం 116 మంది మరణించినట్టు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. మృతుల్లో 23 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు. పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది.
పాదాలను తాకే ప్రయత్నంలోనే..
సత్సంగ్ ముగుస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భోలే బాబా వెళ్తుండగా ఆయనను దగ్గరగా దర్శనం చేసుకునేందుకు, ఆయన పాదాలు తాకేందుకు, ఆయన పాదాలు తాకిన మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. కార్యక్రమానికి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, ఊహించిన దాని కంటే ఎక్కువ భక్తులు రావడం, కార్యక్రమం జరిగిన ప్రాంతంలో నేల చిత్తడిగా మారడం కూడా తొక్కిసలాటకు కారణమని పలువురు తెలిపారు. కాగా, ఈ ప్రైవేటు కార్యక్రమం బయట స్థానిక అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసిందని, లోపల మాత్రం నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిశ్ కుమార్ తెలిపారు.
మృతులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
హాథ్రస్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఎవరీ భోలే బాబా?
‘భోలే బాబా’ అసలు పేరు నారాయణ్ సాకార్ హరి. తనను తాను దేవుడికి శిష్యుడిగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. ఇతడి స్వస్థలం యూపీలోని ఈటా జిల్లాలో బహదూర్ గ్రామం. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పనిచేశానని, ఆధ్యాత్మిక జీవితం కోసం 26 ఏండ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశానని చెబుతుంటాడు. ఆయన అనుచరులు అలీగఢ్లో ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటారు. కాషాయ వస్ర్తాలు ధరించకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం ఈయన ైస్టెల్! ఖరీదైన అద్దాలు, తెల్లని సూట్, టై ధరించి ఈయన నిర్వహించే ‘సత్సంగ్’ కార్యక్రమాలకు పశ్చిమ యూపీలో భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు.
గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశ ప్రజల్ని షాక్కు గురిచేసింది. మృతుల సంఖ్య 100 దాటే అవకాశముంది. భారత్లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు ఇవి..
2005: మహారాష్ట్రలోని మంధారదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340మందికిపైగా మృతి.
2023 మార్చి 31: ఇండోర్లో ఓ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పురాతన బావిపై నిర్మించిన స్లాబ్ కూలిపోవటంతో 36 మంది చనిపోయారు.
2015 జూలై 14: రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. 27మంది భక్తులు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2014 అక్టోబర్ 3: పట్నాలోని గాంధీ మైదాన్లో చేపట్టిన దసరా ముగింపు వేడుకల్లో తొక్కిసలాట జరిగి 32మంది చనిపోయారు.
2013 అక్టోబర్ 13: మధ్యప్రదేశ్ దాటియా జిల్లాలో రతన్గఢ్ ఆలయానికి సమీపంలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు.
2011 జనవరి 14: కేరళ ఇడుక్కి జిల్లాలో ఓ జీపు శబరిమల యాత్రికులపైకి దూసుకెళ్లగా, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 104 మంది భక్తులు చనిపోయారు.
2010 మార్చి 4: యూపీ ప్రతాప్గఢ్ జిల్లాలో రామ్జానకి ఆలయం వద్ద ఆహారం, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. తొక్కిసలాటలో 63 మంది చనిపోయారు.
2008 సెప్టెంబర్ 30: రాజస్థాన్ జోధ్పూర్ నగరంలో చాముండా దేవి ఆల యం వద్ద జరిగిన తొక్కిసలాటలో 250 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
2008 ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లోని నైనా దేవి ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనలో 162 మంది చనిపోయారు.
2003 ఆగస్టు 27: నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట వల్ల 39 మంది మృత్యువాత పడ్డారు.