యాదాద్రి భువనగిరి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : స్వర్ణగిరీశుడి దర్శనం ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యిందని, క్షేత్రానికి ఇప్పటి వరకు 46లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. ఆలయ ప్రతిష్ట చేసి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర నలుమూల నుంచే గాక దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని వివరించారు.
ఇప్పటివరకు వివిధ ట్రస్ట్ల ద్వారా రూ.12.49కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఆలయానికి వచ్చే ప్రతి పైసా భక్తుల కోసమే ఖర్చు చేస్తామని, ఒక్క పైసా దుర్వినియోగం చేయబోమని తెలిపారు. దేశంలోనే ఆధునిక ఆర్కిటెక్చర్లో అయోధ్య రామమందిరం తర్వాత స్వర్ణగిరి రెండో స్థానంలో నిలిచిందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా వచ్చే నెలలో కాటేజీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని, సీసీ కెమెరాలు, స్కానర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
స్వర్ణగిరీశుడికి ఆర్జిత సేవలు ఇకపై పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు రామారావు తెలిపారు. షోడశోపచార సేవల్లో భాగంగా ఉదయం 5గంటల ప్రారంభమయ్యే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు 16 ఆర్జిత సేవలను www.ytdtemple.com వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. సేవల బుకింగ్ కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. మధ్యాహ్నం 1.30గంటల నుంచి 2.30గంటల వరకు మాత్రమే విరామం ఉంటుందని.. శని, ఆదివారాల్లో ఉదయం 8గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతరాయంగా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మానేపల్లి రామారావు తెలిపారు. తాము ఊహించిన దానికంటే పది రెట్లు అధికంగా భక్తులు వస్తున్నారని, రోజురోజుకు సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులకు వీల్చైర్ ద్వారా స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదట్లో 35 మంది సిబ్బంది ఉండగా, ఇప్పుడు 450 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వివరించారు.
భక్తుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నామని, ప్రారంభంలో రెండు వేల మందికి మాత్రమే పరిమితం కాగా.. ఇప్పుడు రోజుకు 8 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. విరాళాలు అన్నింటికీ సెక్షన్ 80జీ ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు ఉందన్నారు. భక్తుల కోసం స్వామివారికి ప్రీతిపాత్రమైన గోశాలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఉప్పల్ నుంచి క్షేత్రానికి బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. శాశ్వత వీధి దీపాలు, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు మురళీకృష్ణ, గోపీకృష్ణ, అర్చకులు శ్రవణాచార్య, స్థపతి డీఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు.