స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర క్షేత్రం మినీ తిరుపతిగా విరాజిల్లుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ప్రముఖ పుణ్యక్షేత్రమై అలరారుతున్నది. భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నది. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ దివ్య దర్శన భాగ్యం కల్పించడంతోపాటు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ధర్మకర్తలు చెప్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, జూన్ (నమస్తే తెలంగాణ)
స్వర్ణగిరి ఆలయాన్ని ధర్మకర్తలు మానేపల్లి రామారావు, ఆయన కుమారులు మురళీకృష్ణ, గోపీకృష్ణ నిర్మించారు. స్థపతి డీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 22 ఎకరాల్లో ఉన్న క్షేత్ర నిర్మాణానికి దాదాపు ఏడేండ్ల సమయం పట్టింది. మార్చి 6న స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. స్వర్ణగిరి వేంకటేశ్వరుడి విగ్రహం 16 అడుగుల ఎత్తు కాగా, త్రిదండి చినజీయర్ స్వామి శాస్ర్తోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. 108 విష్ణు ఆలయాల నుంచి సేకరించిన మట్టి, నీరు స్వామి వారి విగ్రహం కింద ఉంచి.. వేంకటేశ్వరుడిని ప్రతిష్ఠించారు. నిత్యం స్వామి వారికి అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 100 రోజుల్లోనే 46లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు.
ఆలయంలోకి అడుగు పెట్టగానే స్వామి వారి పాదాలు దర్శనమిస్తాయి. అక్కడి నుంచి గర్భగుడి వైపు 108 మెట్ల మార్గం ఉంటుంది. అలాగే స్వామివారి దశావతార రూపాలను మెట్ల మార్గంలో మంటపాలుగా నిర్మించారు. విగ్రహాలను పాలరాతితో ఎంతో సుందరంగా చెక్కారు. మెట్ల మార్గం దాటగానే గర్భగుడికి సమీపంలో బ్రహ్మరథం దర్శనమిస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశించే ముందు గోపురాలను గమనిస్తే భాగవతం మొత్తం మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. గర్భగుడిలో వెలసిన సువర్ణమూర్తి స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామిని చూసినంతనే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది. అనంతరం సువర్ణమూర్తిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. గర్భగుడి వెలుపలకు రాగానే తిరుపతిలో మాదిరిగా విమాన వేంకటేశ్వర స్వామిని చూడవచ్చు.
క్షేత్రంలో ఉన్న స్తంభాలు వేటికవే ప్రత్యేకమైనవి. గుడిలో సిమెంట్ను ఉపయోగించలేదు. రాతి కట్టడాలు, ఇంటర్లాకింగ్ పద్ధతుల్లో నిర్మించారు. ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయంలో పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల నాటి కళా నైపుణ్యం కనిపిస్తుంది. ఒక్కో స్తంభం ఒక్కో రూపంలో ఉంటుంది. ఆలయం బయట 120 అడుగుల హనుమాన్ ఏకశిలా విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహాన్ని చెక్కడానికి ఐదేండ్ల సమయం పట్టింది. 1,500 కేజీల బరువున్న జయ గంటను ఇక్కడ చూడవచ్చు. ఒక్క సారి మోగిస్తే మూడు నిమిషాల పాటు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తాయి.
ప్రపంచంలో ఎక్కడా లేని మదన గోపాలుడి విగ్రహాన్ని చూడవచ్చు. పది చేతులతో ఉన్న విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఆలయంలో మరో ప్రత్యేక కోనేరు. ప్రపంచంలోనే రెండో జలనారాయణుడి విగ్రహం ఇక్కడ ఉంది. స్వామి వారు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. నేపాల్ తర్వాత ఇక్కడ కొలువుదీరిందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. దీని బరువు 2,500 కిలోలు. ఈ కోనేరు నాలుగు మూలల్లోనూ నాలుగు వేదాలకు ప్రతీకైన విగ్రహ మండపాలు కనిపిస్తాయి. ఒకేసారి 1,200 మంది కూర్చుని స్వామివారి కల్యాణాన్ని తిలకించే వీలుగా కల్యాణ మండపం నిర్మించారు. స్నాన ఘట్టాలు, కల్యాణ కట్ట, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రాంగణం నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి,
ఊహించిన దాని కంటే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆ మేరకు సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు సరిపడా ఏర్పాటు చేశామని, వృద్ధులకు వీల్చైర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోజూ 8వేల నంచి 10వేల మందికి నిత్యాన్నదానం చేస్తున్నట్లు పేర్కొనారు. శాశ్వత వీధి దీపాలు, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా వచ్చే నెలలో కాటేజీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. భక్తుల భద్రత కోసం పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్టీసీ హైదరాబాద్, యాదగిరిగుట్ట నుంచి రోజూ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
స్వర్ణగిరీశుడికి ఆర్జిత సేవలు పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 5గంటల ప్రారంభమయ్యే సప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు 16 ఆర్జిత సేవలను www.ytdtemple.com అనే వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే విరామం ఉంటుంది. శని, ఆదివారాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతరాయంగా స్వామివారిని దర్శించుకోవచ్చు.
వేంకటేశ్వరస్వామికి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మేం అనుకున్న దానికంటే 10 రెట్లు భక్తుల తాకిడి పెరిగింది. రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నాం. భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామివారి దివ్య దర్శనం కల్పించడమే మా లక్ష్యం. మిగిలిపోయిన ఇతర పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఆర్జిత సేవలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
– మానేపల్లి మురళీ కృష్ణ, స్వర్ణగిరి ఆలయ ధర్మకర్త