చందంపేట, జూన్ 28 : ఎస్ఎల్బీసీ పనులను త్వరగా పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. చందంపేట మండలంలోని మన్నెవారిపల్లి సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ ఔట్ లెట్ పనులతో పాటు నక్కలగండి కట్ట నిర్మాణ పనులను శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏజెన్సీ ప్రెసిడెంట్ అనిల్కుమార్ కలెక్టర్కు వివరించారు.
ఈ టన్నెల్ ప్రపంచలోనే 5వ అతిపెద్ద టన్నెల్ కానుందని, 43.93 కిలోమీటర్ల మేర ఉన్న టన్నెల్ పనులు 30 కిలోమీటర్ల మేర పూర్తయినట్లు అధికారులు కలెక్టర్కు వెల్లడించారు. 4వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లే సామర్థ్యంతో టన్నెల్ నిర్మాణం జరుగుతున్నాయని, టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రస్తుతం రూ.4,658.59 కోట్లు అంచనా వ్యయం పెరిగినట్లు అధికారులు వివరించారు. డ్రిల్లింగ్ మిషన్ టీబీఎం పనితీరు తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2 నుంచి సుమారు కిలోమీటర్ మేర ట్రాక్ ద్వారా లోపలికి వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తెల్దేవర్పల్లి గ్రామ పరిధిలోని మోత్యతండా సమీపంలో చేపడుతున్న నక్కలగండి కట్ట నిర్మాణ పనులను ఆయన పరిరిశీలించారు. కట్ట నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు.
భూ నిర్వాసితులకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటి సమస్య తీరనుందని చెప్పారు. అంతకుముందు ఆయన కోరుట్ల సమీపంలో ఉన్న బేస్ క్యాంప్ వద్ద ప్రాజెక్టు ప్రతినిధులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.సత్యనారాయణ, డీఈలు బి.చక్రపాణి, లలిత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మహేందర్, రవిరాజ్, జయప్రకాశ్, జయప్రకాశ్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ఏజీఎంలు దీపక్జైన్, వీరేందర్సింగ్, ఎంపీపీ పార్వతీచందునాయక్, తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, రూరల్ సీఐ సురేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ లచ్చిరాంనాయక్, భరత్కుమార్ పాల్గొన్నారు.