నీలగిరి, జూన్ 20 : పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను సత్వరమే పరిషరించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించే విధంగా పని చేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సంవర్థవంతమైన సేవలు అందించాలన్నారు. విసిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలను కట్టడి చేయాలని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ టీవీల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డయల్ 100పై ఏదైనా సమాచారం వస్తే వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిషరించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ పగలు, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములునాయక్, ఎస్బీ డీఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరు, వారి సమస్యలపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల స్థితిగతులు, స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరూ సాంకేతికంగా అవగాహన కలిగి ఉండి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. దొంగతనాల కట్టడిపై దృష్టి పెట్టాలని, సాయంత్రం రోడ్డుపై విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.