నూతనకల్ ; జూలై 2 : అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, తాసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీని, గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన వెంటనే బయోమెట్రిక్ హాజరు వేసుకోవాలన్నారు.
నూతన విద్యా విధానంలో పాఠ్యాంశ ప్రణాళిక తప్పనిసరిగా అనుసరించాలని, ప్రణాళిక లేకుండా బోధన చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఆరోగ్య సమాచారం సేకరించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహరాన్ని అర్హులందరికీ అందించేలా చూడాలన్నారు. పారశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఆయన వెంట తాసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ సునీత, ఏఓ మురళి, ఎంఈఓ రాములునాయక్ తదితరులు ఉన్నారు.
మద్దిరాలలో
మద్దిరాల : మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఎరువుల దుకానాన్ని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠాలు వింటున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీశారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ అమీన్సింగ్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఎంపీఓ రాజేశ్ ఉన్నారు.