మర్రిగూడ, జూన్ 28 : శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏరియాలో విలువైన పాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాతానన్నారు. మండలంలోని వెంకెపల్లి, వెంకెపల్లి తండా, నర్సిరెడ్డిగూడెం ముంపు బాధితులతో శుక్రవారం ఆయన మాట్లాడారు.
ఇబ్రహీంపట్నంలో సాధ్యపడకపోతే జిల్లాలోని చింతపల్లితోపాటు పలు ప్రాంతాల్లో ప్లాట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తనకు రెండు నెలలు గడువు ఇవ్వాలని, ఈ లోపు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూ నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. అప్పటివరకు నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు పనులకు సహకరించాలని కోరారు. రోడ్డును తొలగించి కట్టను నిర్ణీత ఎత్తు వరకే నిర్మిస్తారని, దాంతో వర్షం నీరు గ్రామంలో నిలిచే అవకాశం లేదని ఇంజినీర్లు చెప్పినట్లు వెల్లడించారు. పనులు ఆపితేనే నష్టపరిహారం వస్తుందనుకుంటే పొరపాటని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం 90శాతం పూర్తయిందని, ప్రభుత్వంతో కొట్లాడైనా రెండు మూడేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని తెలిపారు.
ముందుగా ప్లాట్లు ఇచ్చిన తర్వాతే గ్రామానికి వచ్చే రోడ్డును తొలగించి కట్ట పనులు చేపట్టాలని నర్సిరెడ్డిగూడెం ముంపు బాధితులు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మొరపెట్టుకున్నారు. రోడ్డు తొలగించి కట్ట నిర్మాణం చేపడితే గ్రామం ముంపునకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూ నష్టపరిహారం అందని వాళ్లు ఇంకా ఉన్నారని వాపోయారు. పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇండ్లలోకి నీళ్లు రానివ్వమని, ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం, ప్లాట్లను అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ రాములు నాయక్, ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ తదితరులు ఉన్నారు.