సూర్యాపేట రూరల్, జూన్ 26 : పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధితోపాటు వారి పరివర్తనలో మార్పు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నదని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్రా అన్నారు. మండలంలోని ఇమాంపేట వద్ద జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంత ప్రజలకు, వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించనున్నట్లు తెలిపారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో మొదటగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో పెట్రోల్ బంకు ప్రారంభం కాగా, ఇప్పటికి 30 బంకులు నడుపుతున్నట్లు తెలిపారు.
కలెక్టర్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ఖైదీలకు సత్ప్రవర్తన ముఖ్యమని, జైళ్లశాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించి మంచి పేరు తేవాలని ఖైదీలకు సూచించారు. తప్పు చేసిన వారిని మంచి మార్గంలో నడపాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాజ తీరుపై అవగాహన పెంచుకోవాలని ఖైదీలకు సూచించారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఇతర పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై చాలా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకులో నాణ్యమైన కల్తీ లేని పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపారు. అనంతరం జైల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్ర జిల్లా ఎస్పీకి అందజేశారు.కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రాములు, ఇంజిన్ ఆయిల్ డివిజనల్ రిటైల్ సేల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సబ్ జైలు అధికారి శోభన్బాబు, సూర్యాపేట సబ్ జైలు సూపరింటెండెంట్ సుధాకర్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.