నీలగిరి, జూలై 2 : నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముసాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముసాన్-10 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1 నుంచి 31 వరకు నెల రోజులపాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్లు అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తామని తెలిపారు.
18సంవత్సరాల్లోపు తప్పిపోయిన, నిరాదరణకు, వివిధ రకాల బాల కార్మికులు ఉన్నట్ల్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్కు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించినా, వెట్టి చాకిరీ చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాల్లో పిల్లలకు సంబంధించిన సమాచారానికి 1,098, 100 నంబర్లకు తెలియజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీడీఎస్పీ రమేశ్, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సకుబాయి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.