నల్లగొండ, జూలై 28 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో శుక్రవారం డీసీఓ కిరణ్ కుమార్ సమక్షంలో జరిగిన అవిశ్వాస పరీక్షలో అనుకూలం కంటే వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉండటంతో గొంగిడిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టయ్యింది. ఉదయం 11 గంటలకు డీసీసీబీలో డీసీఓ కిరణ్ కుమార్ సమక్షంలో ఈ అవిశ్వాస పరీక్ష జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార బ్యాంకు డైరెక్టర్లు మొత్తం 20 మంది ఉండగా అందులో ఒకటి ఖాళీ ఉంది. ఇక మిగిలిన 19 మందిలో చైర్మన్ మహేందర్రెడ్డితో పాటు అప్పిరెడ్డి, రంగాచారి, ప్రవీణ్ రెడ్డి మినహా 15 మంది డైరెక్టర్లు హాజరై చైర్మన్కు వ్యతిరేకంగా ఓటు చేశారు. దాంతో ప్రతిపక్ష సభ్యలు పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు డీసీఓ కిరణ్ కుమార్ ప్రకటించారు. అవిశ్వాసం నెగ్గడంతో వెంటనే చైర్మన్ కొత్త చైర్మన్ ఎన్నిక చేయలేనందున ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఉన్న ఎసిరెడ్డి దయాకర్ రెడ్డిని తాత్కాలిక చైర్మన్గా డీసీఓ నియమించారు. జూలై 1న కొత్త చైర్మన్ను ఎన్నుకోవడానికి సభ్యులందరూ హాజరు కావాలని సూచిస్తూ ఆయన వెంటనే అందరికీ నోటీసులు అందజేశారు. అప్పటి వరకు దయాకర్రెడ్డి తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించనున్నారు. అవిశ్వాస ఘట్టం ముగిసిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు డీసీసీబీ వద్దకు చేరుకొని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
కొత్త చైర్మన్గా కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి ప్రధాన అనుచరుడు, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డిని ఎన్నుకోనున్నారు. గడిచిన 15 రోజులుగా డైరెక్టర్లను క్యాంపునకు తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చేసింది కూడా ఆయనే. కొత్తగా ఎన్నికైన చైర్మన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుండగా ప్రభుత్వం ఒకవేళ అదనపు సమయం ఇస్తే ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం ఉంది.
డీసీసీబీలో అవిశ్వాసం నెగ్గిన అనంతరం తాత్కాలిక చైర్మన్గా ఎన్నికైన ఎసిరెడ్డి దయాకర్ రెడ్డితో పాటు కాబోయే కొత్త చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాలక వర్గానికి ఉన్న సమయంలో రైతు సంక్షేమం కోసం పాటుపడతామని ప్రకటించారు. ప్రభుత్వం అందజేసే ఫలాలు ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని, పాలక వర్గం డైరెక్టర్ల సలహాలు, ఉద్యోగుల సహకారంతో ముందుకు పోతామని తెలిపారు.