రామగిరి, జూలై 2 : ‘నిరుద్యోగులకు అండగా ఉంటామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని తుంగలోతొక్కింది. నిరుద్యోగుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నది’ అని ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగి లోయపల్లి కృష్ణ ఆదేదన వ్యక్తం చేశారు. ‘నమస్తే తెలంగాణతో ఆయన మంగళవారం మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ టెట్ నిర్వహించి వాటి ఫలితాలను జూన్ 9న వెల్లడించిందని, దానిలో అర్హత సాధించిన వారు డీఎస్సీకి సిద్ధం కావడానికి సమయం తక్కువ ఉండటంతో సిలబస్ను చదవలేకపోతున్నాని అన్నారు. అందుకే డీఎస్సీని రెండు నెలలు వాయిదా వేసి, పోస్టుల సంఖ్య పెంచి మెగా డీఎస్సీని వేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
మరో వైపు జోనల్ వ్యవస్థతో ప్రస్తుతం వెల్లడించిన గ్రూప్-2, 3 నోటిఫికేషన్స్తో పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉందని, వాటిని పెంచాలని చెప్పారు. గ్రూప్స్ ఉద్యోగాల్లో చార్మినార్ను ఫ్రీ జోన్ చేస్తే కొంత మందికి న్యాయం జరిగేదని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత శాతం 1:100గా వెల్లడించాలని, ఇలా చేయడంతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు. ఉత్తీర్ణత శాతం పెంచడంతో అభ్యర్థులకు ఊరట కలుగుతుందని, ఎవరికి ప్రతిభ ఉందో వారికే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 3 సాయంత్రంలోగా వీటిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఈ నెల 4న టీజీపీఎస్సీని లక్షమంది నిరుద్యోగులు ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు ఎలా వెళ్లాలో ఇప్పటికే ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. ఎంతో కాలంగా గ్రంథాలయంలో పుస్తకాలతో పోటీ పడుతూ చదవుతున్న నిరుద్యోగుల ఆశల్లో నీళ్లు చల్లే విధంగా సర్కారు, అధికారులు వ్యవహరించడం తగదని హెచ్చరించారు.