సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నిరాశను మిగిల్చింది. బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలకు అనేక అంచనాలు ఉండగా కేటాయింపులు సరిపడా లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిసారి రూ.లక్ష కోట్లకు తగ్గకుండా బడ్జెట్లో కేటాయిస్తూ రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.19,746 కోట్లు కేటాయించింది. అందులో రూ.3వేల కోట్లు వేతనాలకు పోగా రూ.16వేల కోట్లు మాత్రమే మిగిలేవి.
వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసాకు రూ.22వేల కోట్లు, రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రూ.40 వేల కోట్లు, పంటలకు బోనస్ తదితరాలు కలిపి రూ.82వేల కోట్లు కావాల్సి ఉండగా కేటాయించింది మాత్రం రూ.16వేల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న ప్రేమ దీన్ని బట్టి అర్థమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్న మాట బడ్జెట్ ప్రసంగంలో కనిపించ లేదు. ఇక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. గ్యారెంటీలకు చట్టం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో చట్టంపై చర్చ లేదు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేరుతో గృహ జ్యోతి పథకం అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కేవలం రూ.2,418 కోట్లు వెచ్చించింది. సూర్యాపేట జిల్లాలోనే 2,85,691 గృహాలు ఉండగా అన్నింటికీ 200 యూనిట్ల చొప్పున ఉచితంగా ఇచ్చేందుకు అయ్యే చార్జి వెయ్యి రూపాయలు. ఈ లెక్కన ఒక్క సూర్యాపేట జిల్లాకే నెలకు రూ. 285 కోట్లు, ఏడాదికి రూ.3,428 కోట్లు అవుతుంది. మరి బడ్జెట్లో ప్రతిపాదించిన 2,418 కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో ప్రశ్నార్థకంగా ఉంది. గృహ జ్యోతితోపాటు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత,
యువ వికాసం తదితర పథకాలకు సూర్యాపేట జిల్లా వరకే లెక్కేసుకున్నా ఏటా దాదాపు రూ.28వేల కోట్లు అవసరం అవుతుండగా, ఈ బడ్జెట్లో పై పథకాలన్నింటికీ కలిపి రూ.53,196 కోట్లు కేటాయించారంటే అసలు ఈ బడ్జెట్ను ప్రజలు ఎలా నమ్మాలో అర్థం కావడం లేదు. సంక్షేమానికి కూడా కేటాయింపులు కనిపించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మొత్తం కలిపి రూ.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దళితబంధు ఉంచుతారో, పేరు మార్చి వేరేది తెస్తారో లేక తీసేస్తారో తెలియని అయోమయం ఉంది. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడం పట్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.