నీలగిరి, జూన్ 28 : గత రెండు రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న వివాదం సమసిపోయింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి చొరవ తీసుకుని ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వైద్యుల బృందాలతో అభ్యంతరాలపై చర్చలు జరిపారు. జిల్లా ఆస్పత్రిపై పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం ఉద్దేశాన్ని అదనపు కలెక్టర్ వైద్య బృందానికి వివరించారు. దీంతో తమ అభ్యంతరాలపై ఉన్న అనుమానాలు నివృత్తి కావడంతో వైద్యబృందం సైతం పర్యవేక్షణకు ఓకే చెప్తూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా తమ కృషి ఉంటుందని చెప్పడంతో కథ సుఖాంతమైంది.
గురువారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలతో శుక్రవారం అదనపు కలెక్టర్, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. శుక్రవారం నలుగురు సభ్యులతో కూడిన నల్లగొండ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ బృందం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రను ఆయన ఛాంబర్లో కలిసి చర్చలు జరిపారు. అనంతరం అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర చర్చల వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం నల్లగొండ వైద్య కళాశాల నుంచి ఇద్దరు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్కు చెందిన ఖమ్మం, సూర్యాపేట వైద్య కళాశాలల నుంచి వచ్చిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం తన దగ్గరికి వచ్చిందని, నల్లగొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అధికారులతో తనిఖీ చేయించే విషయం తనతో చర్చించారని, చర్చల సందర్భంగా జిల్లా అధికారులతో ప్రధానాస్పత్రిని దవాఖాన పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఒక ఆర్ఎంఓతో కలిపి తనిఖీ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని వారు ఒప్పుకున్నారని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విషయంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చర్చల ప్రకారం జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంపిక చేసిన ఆర్ఎంఓతో కలిసి రేపటి నుంచి జిల్లా అధికారులు యథావిధిగా ప్రజలకు అవసరమైన పరిపాలనపరమైన విభాగాలను తనిఖీ చేస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో చర్చలు జరిపిన వారిలో నల్గొండ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.శ్రీకాంత్ వర్మ, ఎల్.రమేశ్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జోనల్ కార్యదర్శి, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిధర్ నాయక్, జీజీహెచ్ పర్యవేక్షకుడు నిత్యానందం ఉన్నారు.
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు అందాల్సిన మెరుగైన వైద్యసేవలు, ఇతర సౌకర్యాలపై ఇతర శాఖలకు చెందిన అధికారులు, మెడికల్ కళాశాల ఆర్ఎంఓతో కలిసి నిత్య పర్యవేక్షణ చేయనున్నారు. దవాఖానలో ముఖ్యమైన వార్డుల్లో పారిశుధ్యం, టాయిలెట్స్, తాగునీరు, రేడియాలజీకి సంబంధించి ఎక్స్రే, అల్ట్రాసౌండ్ సానింగ్, సీటీసానింగ్, ఈసీజీ వార్డుల్లో లోటుపాట్లు పరిశీలిస్తారు. అలాగే రోగుల భోజనం సంబంధించి వంటగది శుభ్రంగా ఉందా లేదా పరిశీలిస్తారు. భోజనానికి వాడుతున్న కిరాణా సామగ్రి, కూరగాయలు, పప్పు దినుసులు వంటివి తాజాగా ఉన్నది లేనిది చూస్తారు. ఓపీలో ఆరోజు అప్పటివరకు ఎంతమంది వచ్చారు, డాక్టర్లు వారిని చూసి పంపడానికి ఎంత సమయం తీసుకుంటున్నది, అవసరమైన రోగులకు వీల్ చైర్లు, స్ట్రెచర్ వంటివి ఏర్పాటు చేసేందుకు సిబ్బంది సహాయకుల పనితీరును పర్యవేక్షించనున్నారు.
జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అత్యవసర సేవలు మినహాయించి అన్ని రకాల విధులు బహిష్కరించి శుక్రవారం ఉదయం రెండోరోజు వైద్యులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సుమారు రెండుగంటలపాటు ఆందోళన చేయగా కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యులు, సిబ్బంది ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ ఆందుబాటులో లేకపోవడంతో ఆదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రతో చర్చలు జరిపారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు, జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాలను వారికి వివరించారు. డాక్టర్లకు ఉన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని వారు చెప్పారు. డాక్టర్లు చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.