సూర్యాపేట, జూన్ 26 : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాపాలన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి మున్సిపాలిటీల అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోర్డింగ్లు, పట్టణ ప్రకృతి వనాలు, దోబీఘాట్ల నిర్వహణపై సమీక్షించి పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా ఉంచాలని, అందుకు కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. అమృత్, ఎస్బీఎం, 15వ ఫైనాన్స్, పట్టణ ప్రగతి నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పట్టణాల్లో దోమలు ఉత్పత్తి కాకుండా ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. వార్డుల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని, సిబ్బంది తప్పక డ్రెస్ కోడ్ వినియోగించాలని అన్నారు.
వార్డుల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, రాత్రి వేళ వీధిలైట్లు తప్పక వేయాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో వంద శాతం ఇంటి, నీటి పన్నులు వసూలు చేయాలన్నారు. పార్కులు ప్రజలకు ఆహ్లాదం పంచేలా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పట్టణాల్లో వైకుంఠధామాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణాల్లో ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను చూడాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్, అశోక్రెడ్డి, బుచ్చిబాబు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.