చిలిపిచెడ్,(కొల్చారం), మే 17: రైతన్న గుండె చెరువైంది.కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో తీరని దు:ఖమే మిగిలింది. యాసంగిలో కరెంట్ కోతలు, బోరుబావులు నీరు అడుగంటి పంటలకు సరిగ్గా నీరందక వందలాది ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. కొద్దోగొప్పో పండిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెస్తే సేకరణలో కేంద్రాల నిర్వాహకులు చూపిన నిర్లక్ష్యంతో రైతుల కష్టం నీళ్లపాలైంది. నెల, ఇరవై రోజుల కింద నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా కాంటా కాక అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోవాల్సి వచ్చింది.
రెండ్రోజుల కింద కురిసిన అకాల వర్షంతో కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్కాపూర్, చిన్న ఘనపూర్, సంగాయిపేట, రంగంపేట గ్రామాల్లో వర్షానికి వడ్ల కుప్పలు కుప్పలే కొట్టుకుపోగా, రెక్కల కష్టం కండ్ల ముందే నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షం బారినుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు మొన్న అష్టకష్టాలు పడ్డారు. నిన్న ఎక్కడ చూసినా తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ.. నేర్పుతూ.. బస్తాల్లో నింపుతూ రైతులు కనిపించారు. ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరుకాలం శ్రమ నీటిపాలైందని గొడగొడ ఏడుస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇవాళ తాము నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటవెంటనే ధాన్యం కొంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.