హుస్నాబాద్, జూలై 2: ఆర్టీసీ బస్సులు లేక బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా గ్రామాలకు బస్సుల్లేక విద్యార్థులు బడికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. రవాణా శాఖ మంత్రి ఇలాఖాలో ఇప్పటికీ పలు పల్లెలు ఎర్ర బస్సు ఎరుగకుండా ఉండటం విశేషం. దీంతో ఆయా పల్లెల్లోని విద్యార్థులు, మహిళలు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి నుంచి హుస్నాబాద్కు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిసి హుస్నాబాద్లోని హైస్కూల్కు రావా ల్సి వస్తోంది. ఉమ్మాపూర్, మడద, భల్లూనాయక్తండా, బంజేరుపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
కోహెడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. కూరెల్ల నుంచి కోహెడకు బస్సు లేకపోవడంతో రెండు కిలోమీటర్లు నడవాల్సివస్తోంది. శనిగరం, పరివేద, శ్రీరాములపల్లి, గొట్లమిట్ట, నకిరెకొమ్ముల గ్రామాలకు బస్సు లేక విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కన్నపేట మండలంలోని మైసమ్మవాగుతం డా, పంతుల్తండా, మంచినీళ్లబండ, కపూర్నాయక్తండా, మసిరెడ్డితండాకు ఇప్పటికీ బ స్సు సౌకర్యం లేదు. ఆయా గ్రామాల విద్యార్థులు హైస్కూల్కు వెళ్లాలంటే నడిచి వెళ్లాల్సిందే. గుబ్బడి నుంచి జనగామ హైస్కూల్కు విద్యార్థులు నడిచి లేదా సైకిల్పై రావాల్సిందే.