సిద్దిపేట, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పథకాలు, ఎన్నికల హామీలు, వేతనాలు..ఇలా అన్నింటికీ ప్రజలకు నిరీక్షించాల్సి వస్తున్నది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తి అయ్యింది. ఇక జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం జూలై నాలుగుతో ముగియనున్నది. గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే స్థానిక ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని అందించి వారికి సముచిత స్థానం కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, పదవీకాలం పూర్తి అయ్యేలోగా తమ గౌరవ వేతనం వస్తుందా..? అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశగా ఎదరు చూస్తున్నారు.
రాష్ట్రంలో 32 జడ్పీ చైర్మన్లు ఉన్నారు. వీరికి నెలకు లక్ష రూపాయల చొప్పున గౌరవ వేతనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. 538 మంది జడ్పీటీసీలకు నెలకు ఒక్కొక్కరికి రూ. 13 వేలు, వీరిలో 32 మంది జడ్పీ చైర్మన్లు పోనూ మిగిలిన 506 మంది జడ్పీటీసీలకు గౌరవ వేతనాన్ని అందించాల్సి ఉంది. ఎంపీపీలు 538 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల రూ.13 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో 5,817 మంది ఎంపీటీసీలు ఉండగా, వీరిలో నుంచి 538 ఎంపీపీలు పోనూ మిగిలిన 5,279 మంది ఎంపీటీసీలకు నెలకు ఒక్కొక్కరికి రూ. 6,500 చెల్లించాలి. మండలానికి ఒకరు చొప్పున కోఆప్షన్ మెంబర్ ఉన్నారు. వీరు మొత్తం 538 మంది, జిల్లా పరిషత్కు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు ఉన్నారు. మొత్తం జిల్లా పరిషత్లకు కలిపి 64 మంది కోఆప్షన్ మెంబర్లు ఉన్నారు. వీరికి ఎంపీటీసీ, జడ్పీటీసీల తరహాలో సమానంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డిసెంబర్ నుంచి నేటి వరకు ప్రభుత్వం గౌరవ వేతనాలు చెల్లించాల్సి ఉంది. మరో 10 రోజులు పూర్తయితే వీరి పదవీకాలం ముగిసిపోతుంది.గ్రామ సర్పంచులు మొత్తం 12,751 మంది ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 6,500 చెల్లించాలి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది.
వీరి గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ వేతనాలను త్వరగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధులు,విధులు, గౌరవ వేతనం చెల్లించి సగర్వంగా చూసుకున్నది. కాంగ్రెస్ పాలనలో ఈ ఆరు నెలల కాలంలో గ్రామ పంచాయతీలకు నిధులు రాక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. హరితహారం చెట్లకు గాలికి వదిలేశారు. వానకాలం ప్రణాళికలు అమలు కావడం లేదు. గ్రామం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. నిధులు లేక ప్రత్యేక అధికారులు ఏమి చేయలేక పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చుచేసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. మరి కొందరు పంచాయతీ కార్యదర్శలు బయట అప్పులు తెచ్చి గ్రామ సమస్యలను పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.