జహీరాబాద్, మార్చి 1: జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. జీతాలు పెంచడంతోపాటు, ఉద్యోగ భద్రత కలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో 36 అద్దెల బస్సులు నిలిచిపోయాయి. అద్దెబస్సు డ్రైవర్లుకు జీతాలు పెంచాలని పలుమార్లు కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. తక్కువ జీతంతో ఎక్కువ సమయం పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కడైన బస్సు నిలుపకపోతే, ప్రయాణికులు ఫిర్యాదు చేసిన వెంటనే ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నారన్నారు.
అద్దె బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నా డీఎం బస్సులు నిలుపడంలేదని వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జీతాలు పెంచేందుకు చర్యలు తీసుకొని, ఉద్యోగ భద్రత కల్పించేందుకు హామీ ఇవ్వాలన్నారు. డీఎం నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అద్దె బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటలతరబడి నిరీక్షించారు. కర్ణాటకకు చెందిన బస్సులు రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి. బస్సుల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.