సంగారెడ్డి, జూన్ 4(నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ 46,188 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్పై విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1973 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగ్గా 12,25,045 మంది ఓట్లు వేశారు. ఎన్నికల అనంతరం 2,745 ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చారు. మంగళవారం గీతం యూనివర్సిటీలో నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కించారు. జహీరాబాద్ పార్లమెంట్లో కనిష్టంగా 19 రౌండ్ల నుంచి గరిష్టంగా 23 రౌండ్ల వరకు లెక్కింపు జరిగింది. మొదట రెండు రౌండ్లు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత వరుసగా ఈవీఎంల్లోని ఓట్లను రాత్రి 7గంటల వరకు లెక్కించారు. అనంతరం ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ గెలుపొందినట్లు ప్రకటించారు. సురేశ్షెట్కార్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యోగులు బీజేపీకి మెజార్టీ ఇచ్చారు. ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో మొత్తం 11,650 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో నోటాకు 44 ఓట్లు పోలయ్యాయి. మరో 84 ఓట్లు రిజెక్టు అయ్యాయి. మొదటి రౌండ్లో 6,889 ఓట్లను, రెండో రౌండ్లో 4,761 ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు 666 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో 304, రెండో రౌండ్లో 362 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ రెండు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్కు 6,207 ఓట్లు పోలయ్యాయి. మొదట రౌండ్లో 3,716, రెండో రౌండ్లో 2,491 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్కు పోస్టల్ బ్యాలెట్లో 4,499 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో 2,734, రెండో రౌండ్లో 2,491 ఓట్లు వచ్చాయి. మిగితా 17 మంది ఎంపీ అభ్యర్థులకు 150 ఓట్లు వచ్చాయి.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పోస్టల్ ఓట్లతో కలిపి మొత్తం 12,25,027 ఓట్లను లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్కు 5,28,418 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్కు 4,82,230 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు 1,72,078 ఓట్లు వచ్చాయి. సమీప బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్పై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్షెట్కార్ 46188 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్షెట్కార్ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో అధికంగా మెజార్టీ వచ్చింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్కు సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చినప్పటికీ మిగితా నియోజకవర్గాల్లో మెజార్టీ రాకపోవటంతో ఓటమి పాలయ్యారు. ప్రధాన పార్టీలతో పాటు ఎన్నికల బరిలో నిలిచిన మిగతా 17 మంది గుర్తింపు పొందిన, స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోయారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే మధ్యాహ్నం పోలింగ్ కేంద్రం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు. ఎంపీగా విజయం ఖాయం కావటంతో సురేశ్షెట్కార్ సాయంత్రం 6 గంటలకు కూతురు గిరిజాషెట్కార్తో కలిసి గీతం యూనివర్సిటీకి చేరుకున్నారు. 7 గంటల తర్వాత తన గెలుపును అధికారికంగా ప్రకటించటంతో ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చాక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సంబురాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ తదితరులు షెట్కార్ వెంట ఉన్నారు.