న్యాల్కల్, ఆగస్టు 1: మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు పూర్తిగా కలుషితంగా వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని ఫిల్లర్బెడ్ ద్వారా న్యాల్కల్ మండలంతో పాటు ఝరాసంగం తదితర గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది నిర్లక్ష్యంతో ఫిల్టర్ చేయకుండానే గ్రామాలకు పచ్చని రంగులో తాగునీరు సరఫరా కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో వ్యవసాయ బావులకు వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఐదు రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీరు పూర్తిగా పచ్చని రంగులో మురికిగా వస్తున్నాయి. ఈ నీరు తాగితే ఎలాంటి జబ్బుల బారిన పడతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంజీరా నదిలో నుంచి నీటిని తోడేసి ఫిల్టర్ చేయకుండానే నేరుగా కలుషిత తాగునీరు సరఫరా చేస్తున్నా, సంబంధిత అధికారుల పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం అడుతున్నారని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పంధించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు పచ్చని రంగులో వస్తోంది. తాగేందుకు వీలు లేకుండా ఉంది. ఇలాంటి కలుషిత నీటిని తాగితే ఎలాంటి వ్యాధులు వస్తా యో తెలియని పరిస్థితి ఉంది. వాడుకునేందుకు సైతం ఇబ్బందిగా ఉంది. సంబంధిత అధికారులు తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి.
-గోపాల్, చీకూర్తి, న్యాల్కల్ మండలం
నాలుగైదు రోజుల నుంచి పచ్చని రంగులో కలుషితమైన నీరు వస్తున్నాయి. నల్లాలో నుంచి బకెట్లు, బిందెళ్లలో పడిన నీటిని చూడగానే భయంకరంగా కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఫిల్టర్ కాకుండానే ఇలా నీటిని సరఫరా చేస్తున్నారు. పెద్ద సార్లు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– భూమారెడ్డి, చీకూర్తి, న్యాల్కల్ మండలం