గజ్వేల్, జూలై 2: గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, కొండపాక, కుకునూర్పల్లి మండలాల్లోని చాలా గ్రామాలకు ఆర్టీసీ సేవలు సరిగ్గా అందడం లేదు. బస్సుల సమయపాలన పాటించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్, అంతాయిగూడ, జంగంరెడ్డిపల్లి, రాయవరం, పలుగుగడ్డ, దౌలాపూర్, బీజీ వెంకటాపూర్ గ్రామాల విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళ్ల్లేందుకు ఆటోలే దిక్కవుతున్నాయి. కొంతమంది విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. వర్గల్ మండలంలోని గోవిందాపూర్, గిర్మాపూర్, నెంటూర్, మైలారం గ్రామాల మీదుగా వచ్చే బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు చాలా సందర్భాల్లో సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నారు. గజ్వేల్ మండలం దాతర్పల్లి, రంగంపేటకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఆటోలోనే వెళ్తున్నారు. ములుగు మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొండపాక, కుకునూర్పల్లి మండలాల్లోని బొబ్బాయిపల్లి, తిప్పారం, మేధినిపూర్, మంగోల్ గ్రామాలకు చెందిన విద్యార్థులు సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ డిపో పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 11 ఆర్టీసీ బస్సులు 44 రూట్లలో ప్రతిరోజూ గ్రామాల మీదుగా తిరుగుతున్నాయి. ఒక్కో బస్సు మూడు నుంచి నాలుగు గ్రామాలకు వెళ్తున్నది. వీటితో పాటు ప్రధాన మార్గాల్లోని భువనగిరి, సంగారెడ్డి, సికింద్రాబాద్, రామాయంపేట, దుబ్బాక ప్రాంతాల్లోని బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
దుబ్బాక, జూలై 2: దుబ్బాక డిపోలో అరకొర బస్సులతోపాటు సిబ్బంది కొరతతో పలు రూట్లలో బస్సులు తిరగడం లేదు. దీంతో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, సైకిళ్లపై విద్యార్థులు బడికి, కళాశాలలకు వెళ్తున్నారు. దుబ్బాక డిపోలో 30 ఆర్టీసీ బస్సులు, 8 అద్దె బస్సులు ఉన్నాయి.10 రూట్లలో బస్సులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో నియోజకవర్గంలో దుబ్బాక డిపోకు చెందిన బస్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. గతంలో మాదిరిగా ఇతర డిపోల బస్లు నడిపించకపోవడంతో సమస్యగా మారింది. దుబ్బాక-ముస్తాబాద్ రూట్లో కేవలం ఒక బస్సు మాత్రమే కొనసాగించడంతో సమస్యగా మారింది. దుబ్బాక నుంచి సిద్దిపేట వయా చేర్వాపూర్ మీదుగా బస్ నడపకపోవడంతో విద్యార్థులు 2 కి.మీ వరకు నడిచి వెళ్తున్నారు. మిరుదొడ్డి మండలం మోతె, బేగంపేట, చెప్యాల, జంగపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలకు బస్ లేకపోవడంతో ఆటోల్లో బడికి వెళ్తున్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మాచిన్పల్లి, గొల్లపల్లి, రామారం, వడ్డేపల్లి గ్రామాలకు బస్సులు లేక ఆటోలు, ఇతర వాహనాలపైనే వెళ్తున్నారు.