నర్సాపూర్, జూలై 2: నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బస్సులు సరిగ్గా నడవక విద్యార్థులు అరిగోస పడుతున్నారు. బస్సులు సరిగ్గా రాక, వచ్చినా ఎక్కడానికి స్థలం లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నర్సాపూర్లో బస్డిపో ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థుల కష్టా లు మాత్రం తీరడం లేదు. కొన్ని మార్గాల్లో బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. నర్సాపూర్ మండలంలోని ఎల్లాపూర్, ఆవంచ గ్రామాలకు బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కిలోమీటర్ నడిచి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. జక్కపల్లి మోడల్ స్కూల్కు మూడు బస్సులు వస్తుండగా అవి సరిపోవడం లేదని ఇంకో బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. శివంపేట్ మండలంలోని ఉసిరికపల్లి, పాంబండ గ్రామాలకు చెందిన విద్యార్థులు నర్సాపూర్, తూప్రాన్ కళాశాలల్లో చదువుకోవడానికి నిత్యం వెళ్తుంటారు.
గతంలో ఈ మార్గంలో బస్సు ఉండేది. ప్రస్తుతం బస్సు సౌకర్యం నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిలిపిచెడ్ మండల పరిధిలోని సోమక్కపేట్, శీలంపల్లి, ఫైజాబాద్, అజ్జమర్రి, గంగారం గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం జోగిపేట్, కౌడిపల్లి మండల కేంద్రాలకు చదువుకోడానికి వెళ్తుంటారు. ప్రస్తుతం ఆ మార్గాల్లో బస్సులు రాక విద్యార్థులు తంటాలు పడాల్సి వస్తుంది. కొల్చారం పరిధిలోని రాంపూర్, కిష్టాపూర్, ఘనపూర్, రంగంపేట్ విద్యార్థులు బస్సుల్లో ఎక్కడానికి ఫీట్లు చేస్తూ ఫుడ్బోర్డ్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఉదయం బస్సులు నిండుగా రావడంతో స్టాప్ల వద్ద ఆపడం లేదని విద్యార్థులు పేర్కొం టున్నారు. కొల్చారం, వెల్దుర్తి కళాశాలలకు వెళ్లే అంసాన్పల్లి, కొంగోడ్, జలాల్పూర్ మార్గాల్లో బస్సులు సమయానికి నడపాలని విద్యార్థులు కోరారు. కౌడిపల్లి నుంచి వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామాల మధ్యలోని లింగంపల్లి, కొటాల, వెల్మకన్న గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేడయంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.