పటాన్చెరు, జూన్ 28 : సంగారెడ్డి జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. శుక్రవారం ఇస్నాపూర్ పంచాయతీ పరిధిలో ఏకంగా ఆరేండ్ల చిన్నారిపై కుక్కలు దాడిచేసి చంపేశాయి. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో బీహార్కు చెందిన బుల్బుమ్, ప్రమీల దంపతులు మహీధర వెంచర్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వెంచర్ వద్ద గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి కుమారుడు విశాల్ (6) బహిర్బూమికి గుడిసె సమీపంలో వెళ్లాడు. అక్కడు వీధికుక్కలు విశాల్పై దాడిచేసి తలకొరికి చంపేశాయి. కుక్కలు విశాల్ను తినే ప్రయత్నం చేయడం గమనించిన కూలీలు, స్థానికులు కుక్కలను తరిమి విశాల్ మృతదేహాన్ని కాపాడుకున్నారు. భార్యాభర్తలు కుమారుడి మృతదేహాన్ని చూసి విలపించారు. పటాన్చెరు సీఐ ప్రవీణ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు.
పటాన్చెరు మండలం ముత్తంగిలో శుక్రవారం వీధికుక్క దాడిలో స్వాతి (7) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికను స్థానికులు కుక్క దాడి నుం చి కాపాడి చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానకు తరలించారు.
పటాన్చెరు మండలం కర్ధనూర్లో బుధవారం రోజు వీధి కుక్కలు భాను(13) అనే బాలుడిపై దాడిచేసి గాయపరిచాయి. కుటుంబసభ్యులు అతడిని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఇస్నాపూర్, ముత్తంగి, కర్ధనూర్, లక్డారం, చిట్కు ల్, పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్లో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. కుక్కల దాడిలో నిత్యం అనేక మంది గాయపడుతున్నారు. లక్డారం గ్రామంలో ఇటీవల 10మందిని ఒక కుక్క కరిచింది. పిచ్చికుక్కలు, వీధి కుక్కలు ద్విచక్రవాహనాలను వెంబడించి ప్రజలను కరుస్తున్నాయి. అకస్మాత్తుగా వెంట పడుతుండడంతో వాహనదారులు వాటి బారినుంచి తప్పించుకునేందుకు వేగంగా ముం దుకు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు, వ్యాక్సిన్ వేసేందుకు గతేడాది కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వీధికుక్కలను పట్టుకుని కందిలోని వెటర్నరీ ఆపరేషన్ థియేటర్కు పంపించాలని ఆదేశించారు. అప్పుడు తూతూమంత్రంగా కుక్కలను పట్టుకుని ఆపరేషన్లు చేశారు. అధికశాతం కుక్కలను పట్టకపోవడం ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదికి వస్తున్నది. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. గ్రామాల్లో ఓవర్హెడ్ నీటి ట్యాం కులు, ఇండ్ల డాబాలపై రాత్రి వేళల్లో నిద్రిస్తున్నాయి. కుక్కల భీకర అరుపులతో ప్రజలకు రాత్రివేళ నిద్ర కరువవుతున్నది.