అందోల్, జూలై 3: వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో జోగిపేటలో ఏర్పాటు చేసిన 100 పడకల దవాఖానలో వైద్యసేవలు సరిగ్గా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో 14 మంది డాక్టర్లు, 40 మంది నర్సులు, 38 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సరిపడా సిబ్బంది ఉన్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సేవలు సరిగ్గా అందడం లేదు. బుధవారం నమస్తే ‘తెలంగాణ’ దవాఖానను సందర్శించగా అనేక సమస్యలు కనిపించాయి. రోగులకు స్లైన్లు పెట్టిన సిబ్బంది అక్కడ పత్తాలేకుండా పోయారు. ఓ గర్భిణీకి స్లైన్ పూర్తిగా అయిపోవడంతో దానిని తీసేందుకు వైద్య సిబ్బంది కోసం దవాఖాన మొత్తం వెతికినా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రోగి సహాయకులే స్లైన్లు తొలిగించారు. బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణీ ప్రసవించగా.. చిన్నారి బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కోసం తల్లిదండ్రులు అక్కడికి రాగా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం, అక్కడ గంటపాటు ఎదురుచూసినా ఎవరూ అక్కడికి రాకపోవడంతో చిన్నారిని తీసుకుని ప్రసూతి వార్డుకు వెళ్లారు. పుట్టిన పిల్లలను ఇలా ఒంటరిగా వదిలేస్తే ఎలా…? మేము కాకుండా పిల్లలను ఎవరైనా తీసుకెళ్తే ఎవరిది బాధ్యత అంటూ చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. వైద్యసిబ్బంది కోసం రిసెప్షన్తో పాటు వారి గదుల్లో వెతికినా లేరని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేశా రు. జోగిపేట దవాఖానలో బెడ్ల మీద బెడ్షీట్లు కరువయ్యాయి. బెడ్షీట్లు లేకున్నా రోగులను అలాగే బెడ్ల మీద పడుకోబెడుతున్నారు. పూర్తిగా చిరిగిన బెడ్లను సైతం రోగుల కోసం వాడుతుండడం ఇక్కడి వైద్యసేవల దుస్థితికి అద్దం పడుతున్నది.
గర్భిణులు, బాలింతలు ఉండే వార్డులో టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. మూడు రోజులుగా బాలింతలు వాడిన డైపర్స్, ఇతరత్రా వస్తువులు అక్కడే ఉంచారు. దీంతో భరించలేని కంపుతో ఇబ్బందిగా ఉందని బాలింతలు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్లు సైతం సరిగా శుభ్రం చేయడం లేదని, తప్పనిసరి పరిస్థితిలో భరిస్తూ ఇక్కడే ఉంటున్నామని వాపోయారు. ఇక్కడ పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ప్రతి పనికీ డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకుంటే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపలి గదులతోపాటు దవాఖాన చుట్టూ పరిసరాలు సైతం కంపుకొడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగాయి. నల్లాల వద్ద వ్యర్థాలు నిలిచి దుర్గంధం వ్యాపిస్తున్నది. దీంతో రోగాలు తగ్గే మాట దేవుడెరుగు కొత్త రోగాలు బారినపడతామని రోగులు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో జోగిపేట దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పలుమార్లు రివ్యూలు నిర్వహించి వైద్యసిబ్బందికి ఆదేశించారు. కానీ ఇక్కడి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. వైద్యసిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నారు. దవాఖానలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పరిసరాలు కంపుకొడుతున్నాయి. దీంతో రోగులు నరకం అనుభవిస్తున్నారు.
మూడు రోజులుగా ప్రసూతి వార్డులోని బాత్రూం కంపుకొడుతున్నది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వాడిన వస్తువులు అక్క డే పడేశారు. వాటిని తీసుకెళ్లాల్సిన సిబ్బంది రాకపోవడంతో దుర్గంధంతో ముక్కు మూసుకుని కూర్చుంటున్నాం. పారిశుధ్య సిబ్బంది పైపైనా పనులు చేసి వెళ్తున్నారు. టాయిలెట్ల నుంచి వచ్చే వాసన భరించలేక పోతున్నాం. ఏమన్నా అంటే దురుసుగా మాట్లాడుతున్నారు. ప్రతి పనికీ డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకుంటే తిడుతున్నారు.
మాకు పాప పుట్టింది. బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూ లో ఉంచారు. బుధవారం పాప ను చూసేందుకు ఐసీయూ వద్దకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. గంటకుపైగా అక్కడే కూర్చు న్నా ఎవరూ రాకపోవడంతో పాప బాగా ఏడుస్తున్నది. దీంతో పాల కోసం ఏడుస్తున్నదని పాపను ప్రసూతి వార్డులోకి తీసుకువచ్చాం. మేము తీసుకెళ్లాం కాబట్టి సరిపోయింది. ఎవరైనా బయటి వ్యక్తులు పాపను తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి. పేషెంట్లకు సైతం స్లైన్ పెట్టి వెళ్లారు. అది అయిపోయినా చాలాసేపటి వరకు సిబ్బంది ఎవరూ రాకపోవడంతో వెంట వచ్చిన వారే స్లైన్ తీసేశారు.
జోగిపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు ఎలాం టి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. దవాఖానలో పైప్లైన్లు, ఇతరత్రా పనులు చేపడుతునందున అక్కడక్కడ కొంత పారిశుధ్య పనులు సరిగా చేపట్టడంలో ఆలస్యం జరుగుతున్నది. ప్రసూతి వార్డులో డబ్బులు అడుగుతున్నారని గతంలో కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. బుధవారం పేషెంట్కు స్లైన్ పెట్టి అయిపోయిన తర్వాత కూడా దానిని తొలిగించకపోవడంపై తగిన విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.