హుస్నాబాద్, జూలై 5: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమైనదని, ప్రతి అభివృద్ధి పనిని సకాలంలో పూర్తిచేసి, చేయబోయే పనులను తన దృష్టికి తీసుకురావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని సమీకృత కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, కరీంనగర్ కలెక్టర్ ప్రమీలా సత్పతి, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో వ్యవసాయం, విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టిసారించి వీటిల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని, గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి నిధులు, చేయాల్సిన పనుల వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. హుస్నాబాద్ను పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలన్నారు. ఎల్లమ్మ ఆలయం, గౌరవెల్లి, శనిగరం ప్రాజెక్టులు, మహాసముద్రం గండి, రాయికల్ జలపాతం, సర్వాయిపేట కోట, పీవీ గ్రామం వంగర, కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ పనులతో పాటు చేనేత, వ్యవసాయాధారిత రంగాల అంశాలపై రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దని, స్వశక్తి సంఘాలను బలోపేతం చేయాలని, మహి ళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయకట్టుకు సత్వరంగా నీరందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. సమావేశంలో మూడు జిల్లాల కలెక్టర్లతోపాటు అడిషనల్ కలెక్టర్లు గరీమా అగర్వాల్, ప్రపుల్ దేశాయ్, రాధికగుప్తా, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీకిరణ్వెంకట్రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గౌరవెల్లి భూనిర్వాసితులను ఆదుకుంటాం
గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని, వా రికి బకాయిలు చెల్లించేందుకు కృషిచేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. సమీక్షా సమావేశం అనంతరం ఐవోసీ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వాయర్పై కొందరు రైతులు, నిర్వాసితులు ఎన్జీటీలో వేసిన కేసులను ఉపసంహరించుకునేలా వారితో మాట్లాడుతామన్నారు. రిజర్వాయర్కు కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించామని, త్వరలోనే పనులు ప్రారంభించి ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. సమీక్షా సమావేశంలో 15అంశాలపై చర్చ జరిగిందని, పలు అంశాలను కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, వాటిని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. మళ్లీ మూడు నెలలకు నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించి పనులను పర్యవేక్షించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.