సంగారెడ్డి, జూన్ 29(నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంచడానికి బీఆర్ఎస్ సర్కార్ హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు పదేండ్లలో ఎంతో కృషిచేసింది. బీఆర్ఎస్ పాలనకు ముందు సంగారెడ్డి జిల్లాలో అటవీ విస్తీర్ణం 4.13 శాతం ఉండేది. కేసీఆర్ సర్కార్ హరితహారం ద్వారా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేండ్లలో 944.65 లక్షల మొక్కలు నాటింది. మొక్కల పెంపకం ద్వారా జిల్లాలో అడవుల విస్తీర్ణం 6.45 శాతం పెరిగింది. పర్యావరణానికి, ప్రజలు మేలుచేసే హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వానకాలం ప్రారంభమై నెలరోజుల తర్వాత తీరిగ్గా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శనివారం వరంగల్లో సీఎం రేవంత్రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ సర్కారు అమలుచేసిన హరితహారం పేరును ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వన మహోత్సవంగా మార్చింది.
కాగా, విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయని కొద్దిరోజులుగా విద్యుత్ సిబ్బంది ఇష్టారాజ్యంగా హరితహారం మొక్కలను నరికివేస్తున్నారు. కొమ్మలను నరికివేయాలి కానీ ఏకంగా చెట్లను నరికివేస్తూ పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నారు. విద్యుత్ శాఖ తీరుపై ప్రజలు, ప్రకృతిప్రేమికులు, పర్యావరణవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కల పెంపకానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటించి సంరక్షించింది. అటవీప్రాంతాలు, రైతుల భూముల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఇండ్లవద్ద, పెరడులో పూలు, పండ్లు మొక్కలు పెంచుకునేలా ప్రోత్సహించింది. 2015లో సంగారెడ్డి జిల్లాలో హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమై 2023 వరకు దిగ్విజయంగా కొనసాగింది.
తొమ్మిండ్లలో 10.72 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 9.44 కోట్ల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటారు. నాటి ప్రతి మొక్క పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో గ్రీన్కవర్ గణనీయంగా పెరిగింది. కేసీఆర్ సర్కార్ 2024 వానకాలంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ నర్సరీల్లోనూ మొక్కలు సిద్ధం చేసి ఉంచింది. వర్షాలు కురవడం ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు అంతా సిద్ధం చేసింది. అంతలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సంగారెడ్డి జిల్లాలో 2024-25లో జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 28.59 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 647 నర్సరీల్లో 38 లక్షలకు పైగా 20 రకాల మొక్కలు సిద్ధ్దంగా ఉంచారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మొక్కలు నాటేందుకు అనువైన వాతావరణం ఉంది. అయినప్పటికీ యంత్రాంగంలో పెద్దగా కదలిక లేదు.