సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 29: జిల్లాకేంద్రం సంగారెడ్డిలో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో ఎమ్మెల్యే సమావేశమై నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలు, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, అనుమతి లేని నీటి కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, వర్షాకాలం దృష్ట్యా కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు పూర్తి కావడానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. పాత మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్ట్రియల్ జోన్లు ఉండడంతో ఇల్లు కట్టుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కొత్త భవనాలు నిర్మించిన వారికి ఆసెస్మెంట్ చేసి రెగ్యులర్ చేయాలన్నారు. వెజ్-నాన్వెజ్ మార్కెట్ యార్డును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. సదాశివపేటలో డంపింగ్ యార్డు కోసం స్థలం కేటాయించాలని, తారా ప్రభుత్వ కళాశాల, ప్రభు త్వ దవాఖాన, సితార థియేటర్ వద్ద శిథిలావస్థలో ఉన్న నీటి ట్యాంకులను తొలిగించి కొత్తవి నిర్మించాలని అదనపు కలెక్టర్ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.