మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్/ సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 29: ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి శనివారం వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరలతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులపై ఆరాతీశారు. ప్రతిరోజు వెయ్యికి తగ్గకుండా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. వేగంగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సక్సెషన్, పెండింగ్, మ్యూటేషన్ వంటి దరఖాస్తుల రికార్డులను తనిఖీ చేసి వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం సమీకృత గురుకుల విద్యాసంస్థ ఏర్పాటుకు అనుకూలంగా 20 ఎకరాల స్థలాన్ని గుర్తించాలన్నారు.
ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్ర స్వీకరణ సంబంధించి పరికరాల వినియోగ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలకు ఎల్ 1 బయోమెట్రిక్ పరికరాలు పంపించామని, వీటిని సరిగ్గా రీప్లేస్ చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్వో పద్మజారాణి, ఏవో పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సిద్దిపేట గజ్వేల్,హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, రామ్మూర్తి, తహసీల్దార్లు, జిల్లా ధరణి కో ఆర్డినేటర్ వీసీలో పాల్గొన్నారు.