సిద్దిపేట, జూన్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అం దరికీ అమలు కావడం లేదు. ఈ పథకంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ, ఆచరణలో ఇది పూర్తిగా అమలు కావడం లేదు. రేషన్ కార్డు లేదని, సర్వీస్ నెంబర్ తప్పు ఎంటర్ చేయ డం తదితర కారణాలతో చాలామంది జీరో విద్యుత్ అమలు కావడం లేదు. ఒకనెల జీరో బిల్లు విద్యుత్ అందితే..మళ్లీ నెల అదే మీటరు మీద (200 మీటర్లలోపు ) వాడిన కరెంట్ బిల్లు వస్తున్నదని వినియోగదారులు మొత్తుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ జీరోబిల్లు ఇవ్వాలి. కానీ, అలా జరగడం లేదు. ఈ విషయంపై విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే టెక్నికల్ సమస్య అంటూ తప్పించుకుంటున్నారు.
ఈ సారైనా మాకు జీరో బిల్లు వస్తుందా..? అని ఆశగా ప్రతినెలా వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అధికారులు, స్థానికంగా ఎన్రోల్ చేసిన సిబ్బంది ఇద్దరి మధ్యన సమన్వయ లోపంతో వినియోగ దారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతినెలా జిరాక్స్ కాపీలు తీసుకొని ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సెంటర్ల వద్దకు జనం తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామందికి జీరోబిల్లు అందడం లేదు. ఇటీవల సిద్దిపేట జడ్పీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు జీరో విద్యుత్ విషయమై అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు. విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో సగం శాతం మంది అర్హులకు జీరో విద్యుత్ అందడం లేదని తేలింది. గృహజ్యోతి పథకం అమలు కోసం గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి వినియోగదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ, వీరిలో చాలామందికి పథకం వర్తించడం లేదు.
కేంద్రాలకు పరుగులు
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో చాలామంది అర్హులు గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. జీరోబిల్లు వర్తించనందున గ్రామాల నుంచి దరఖాస్తుదారులు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. తప్పుల సవరణల కోసం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 3,47,260 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,71,266 కనెక్షన్లు అర్హులుగా గుర్తించారు. మెదక్ జిల్లాలో 2,05,416 విద్యుత్ కనెక్షన్లకు 1,14,027 కనెక్షన్లు, సంగారెడ్డి జిల్లాలో 5,93,030 విద్యుత్ కనెక్షన్లకు 1,78,064 కనెక్షన్లు అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం ప్రతినెలా రూ.16 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని అధికారుల లెక్కలు వేశారు. ఉచిత విద్యుత్ కోసం గ్రామా ల్లో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.
ఆ దరఖాస్తులను అధికారులు కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. ఇక్కడే అసలు పొరపాట్లు జరిగాయి. కంప్యూటర్ ఆపరేటర్లు అప్లోడ్ చేసే సమయం లో చేసిన పొరపాట్లు వినియోగదారులకు జీరో విద్యుత్ అందకుండా పోయింది. అర్హత కలిగి ఉన్నా నేటికీ జీరో విద్యుత్ అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో రేషన్కార్డు లేదని నమోదు చేశారు. మీటర్ నెంబర్లు తప్పులు ఎంటర్ చేయడంతో పాటు అనేక విధాలుగా తప్పులు దొర్లాయి. రేషన్ కార్డు లేని కుటుంబానికి జీరో విద్యుత్ లేదు. ఎన్నో ఎండ్లుగా రేషన్కార్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రేషన్కార్డులు ఇస్తే వారందరికీ ఉచిత విద్యు త్ అందేది. కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుని మీటర్ వారీగా 200యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారందరికీ రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.
జీరో బిల్లు రాకుంటే కట్టాల్సిందే..
చాలామందికి జీరోబిల్లులు రావడం లేదు. ఇప్పుడు వారంతా బిల్లు కట్టాల్సిందే. ఒకవేళ నెల బిల్లు పెండింగ్ ఉన్నా తదుపరి వచ్చేనెల వడ్డీతో సహా నమోదవుతుంది. జీరోబిల్లు రాని వారు తప్పనిసరిగా బిల్లు కట్టుకోవడం మంచింది. మూడు నెలలుగా ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి తప్పుల సవరణను నిలిపివేశారు. ఈ సమయంలో బిల్లు కట్టాలా..వద్దా….?అనే సందేహాల మధ్య వినియోగదారులు ఊగిసలాడారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేదు. తప్పులు సవరించి వచ్చేనెల అయి నా జీరోబిల్లు వచ్చేలా చూడాలని అర్హులు కోరుతున్నారు.