సదాశివపేట, జూన్ 27: సదాశివపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అపర్ణాశివరాజ్ పాటిల్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సాధారణ సమావేశం ఆలస్యమైందన్నారు. గతంలో కేటాయించిన టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.20 కోట్లతో టెండర్ వేసి పనులు చేసుకోవచ్చని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్డీఎఫ్ నిధుల కింద కేటాయించిన పనులు చాలా జరగాల్సి ఉందన్నారు. రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధుల్లో రూ.11 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని, మిగతా నిధులు కూడా అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలన్నారు.
మిగతా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ సమగ్రాభివృద్ధి, కౌన్సిలర్లకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎ జెండా అంశాలను అధికారులు చదివి వినిపించారు. కౌన్సిలర్లు లేవనెత్తిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ప్రకాశ్, ఇంద్రమోహన్గౌడ్, ఇలియాజ్ షరీఫ్, ఖుద్దూస్, నాగరాజుగౌడ్, విద్యాసాగర్, గుండురవి, కో-ఆప్షన్ సభ్యు డు కోడూరి అంజయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.