సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 30: పార్లమెంట్ ఎన్నికలు-2024కి సంబంధించిన అభ్యర్థుల ఖర్చుల రికార్డులను సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోటీల్లో పాల్గొన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలన కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎన్నికల పరిశీలకుడు మోతీలాల్ షీటే, జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల రికార్డులను పరిశీలించారు. ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించేందుకు అభ్యర్థులు, అభ్యర్థుల తరఫున ప్రతినిధులు, ఏజెంట్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో అభ్యర్థుల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని గుర్తు చేశారు. ఖర్చులు సమర్పించని అభ్యర్థుల వివరాలు ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నారు. అభ్యర్థుల వ్యయ రికార్డులు, ఎన్నికల షాడో బృందాలు నమోదు చేసిన రికార్డు మ్యాచ్ కావాలని, మ్యాచ్ కాకుంటే నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో బాలశౌరి, వ్యయ పరిశీలన నోడల్ అధికారి అంజ య్య, అధికారులు పాల్గొన్నారు.