హుస్నాబాద్, జూన్ 30: దేశంలో నడుస్తున్న వందలాది సరస్వతీ శిశుమందిరాలు సంస్కార కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని, వీటిల్లో చదివిన విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి అలవడుతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతనంగా నిర్మించిన శ్రీ సరస్వతీ శిశుమందిర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశభక్తులను తయారు చేయడంతో పాటు హిందుత్వ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న సరస్వతీ శిశుమందిరాలపై మతం ముద్ర వేసిన పాలకులు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. దేశద్రోహులకు నిలయాలుగా ఉండి, హిందుత్వ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో నడిపిస్తున్న క్రిస్టియన్ మిషనరీలు, మదర్సాల నిర్మాణానికి మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అందులో పనిచేసే వారికి వేతనాలు ఇస్తున్నారంటే హిందుత్వం మీదు ఎంతటి దాడులు జరుగుతున్నాయో తెలుస్తోందన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా శిశుమందిరాలు ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తున్నప్పటికీ విద్యార్థులకు సంస్కారం నేర్పడం మాత్రం కొనసాగుతోందన్నారు. మమ్మీ డాడీ, ఆంటీ అంకుల్ కల్చర్ లేకుండా అమ్మానాన్న సంస్కృతి కొనసాగాలన్నారు. సరస్వతీ శిశుమందిర్ విద్యార్థిగా గర్విస్తున్నానని, అందులో నేర్పిన సం స్కారం, క్రమశిక్షణే తనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని చేసిందన్నారు. పాలకులందరూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాయడం వల్లనే సాధారణ పాఠశాలలు మూతపడుతున్నాయని, శిశుమందిరాలు లేకుండా దేశంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు, పాడిన పాటలు అలరింపజేశాయి. అనంతరం పాఠశాల 40 ఏండ్ల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర ప్రాంత కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి, పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, నాయకులు, విద్యాపీఠం ప్రతినిధులు కోమటిరెడ్డి రాం గోపాల్రెడ్డి, చిట్టి దేవేందర్రెడ్డి, కొత్తపల్లి అశోక్, చిట్టి గోపాల్రెడ్డి, గట్టు రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.