మెదక్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బడి బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పలు మార్గాల్లో బస్సు సర్వీస్లు లేవు. ఉన్న రూట్లలో సమయానికి రాక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మెదక్ జిల్లాలో జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించడానికి వేలా ది మంది విద్యార్థులు రోజూ పాఠశాలలకు వస్తుంటారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు నిత్యం వచ్చిపోతుంటారు. వీరి కోసం ఆర్టీసీ డిపో అధికారులు 14 బడి బస్సులను తిప్పుతున్నారు. అవి సరిపోక పోవడంతో జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మరో 10 బస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులకు విన్నవించారు. అయితే ఆ బస్సులు రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని మెదక్ ఆర్టీసీ డీఎం సుధ తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు బస్సులు లేక అక్కడి విద్యార్థులు ప్రైవేట్ వాహనాల్లో, సైకిళ్లపై వస్తున్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాల, నిజాంపేట మండలం నస్కల్ గ్రామాలకు బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కాట్రియాల పరిసర ప్రాంతాల్లో తండాలు ఉన్నాయి. తండాల్లోని గిరిజన విద్యార్థులు సైకిళ్లపై, నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారు. ఈ రూట్లో బస్సులను వేయాలని పలుమార్లు విద్యార్థులు ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా పరిధిలోని రేగోడ్లో జడ్పీ పాఠశాల ఉంది. కొత్వాల్పల్లి, చౌదర్పల్లి, తిమ్మాపూర్ తదితర గ్రామాల నుంచి విద్యార్థులు జడ్పీ పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఈ రూట్లో బస్సులు లేకపోవడంతో ఆటోల్లో పాఠశాలకు వస్తున్నారు. నర్సాపూర్ మండలంలోని అవంచ, ఎల్లాపూర్ గ్రామాలకు పల్లె వెలుగు బస్సు లు నడకవపోడంతో విద్యార్థులు ఆటోలు, సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తూ అవస్థలు పడుతున్నారు.
మెదక్ పట్టణానికి పరిసర గ్రామాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు రోజూ రెండువేల మందికి పైగా విద్యార్థులు వస్తుంటారు. వీరిలో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు కూడా బస్సు ల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా వీరికి మరో మార్గం లేక ఇలా ప్రయాణిస్తున్నారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు ఇండ్లకు చేరుకోవాలంటే ఫీట్లు చేయాల్సిందే. బస్సులో సీటు మాట దేవుడెరుగు.. ఫుట్బోర్డుపై నిలబడేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. వెల్దుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో నుంచి వచ్చే విద్యార్థుల్లో చాలామంది ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రమాదం అంచు న రాకపోకలు సాగిస్తున్నారు.