హుస్నాబాద్, జూన్ 28: భారత ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్ఫూర్తితో నేటి రాజకీయ నాయకులు ముందుకు పోతే దేశం ఎంతో బాగుపడుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్వర్గీయ పీవీ నర్సింహారావు జయంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించగా వీవీ చిత్రపటం వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణ ముద్దుబిడ్డ, హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గ్రామానికి చెందిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యాడంటే ఆయన కృషి, పట్టుదల ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. దేశంలో ఆర్థిక, భూసంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. ఆయన చూపిన దారిలోనే కాంగ్రెస్ ప్రభు త్వం ముందుకు వెళ్తున్నదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు కేడం లింగమూర్తి, ఎండీ హసన్, బస్వారాజు శంక ర్, చిత్తారి పద్మ, వల్లపు రాజు, పున్న సది, కిష్టస్వామి, వీరన్ననాయక్ పాల్గొన్నారు.