పటాన్చెరు, జూన్ 4: కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడంతో కాంగ్రెస్కు ప్రజాదరణ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ సహకారంతో ఎంపీగా గెలిచానని, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. దేశంలోని ప్రజలను ప్రధాని మోదీ చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహుల్గాంధీ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. మనది సెక్యూలర్ దేశమన్నారు. గంగాజమునా తెహజీబ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, అన్ని వర్గాలు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించారన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను నెరవేరుస్తానని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సురేశ్ షెట్కార్ సంబురాలు చేసుకున్నారు.