సంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో బస్సులు లేక బడి పిల్లలు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 1.30లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 432 ఉన్నత పాఠశాలల్లో 40వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మండల కేంద్రాలతోపాటు మేజర్ పంచాయతీల్లో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీంతో మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు తప్పనిసరిగా గ్రామానికి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చేరి చదువుకోవాల్సి వస్తుంది. జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్లలో డిపోలు ఉన్నాయి. మూడు డిపోల పరిధిలో 124 పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నాయి.
అయితే ఈ బస్సులు ఎంపిక చేసిన, ఆర్టీసీకి లాభదాయకమైన రూట్లలో మాత్రమే నడుస్తున్నాయి. దీంతో వారు ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. సంగారెడ్డి డిపో పరిధిలో 20కి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. సదాశివపేట మండలం పొట్టిపల్లి, మాలపాడు, బొబ్బిలిగామ గ్రామాలకు బస్సులు పోవడం లేదు. సంగారెడ్డి మండలంలో 10కి పైగా గ్రామాలకు, కొండాపూర్లో పదికి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆ గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 17 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. అందోల్ నియోజకవర్గంలో 30కి పైగా గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జహీరాబాద్ డిపో పరిధిలో గ్రామీణ విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉన్నది.