హుస్నాబాద్, ఆగస్టు 20: హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మనుచౌదరితో కలిసి హుస్నాబాద్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. మినీస్టేడియం, బాలురు, బాలికల ఉన్నత పాఠశాల, నిర్మాణంలో ఉన్న పలు ప్రభుత్వ భవనాలను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మినీ స్టేడియంలో పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఇన్ఫినిటీ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్, రోబోటిక్ లాబ్లు ఒక్కోటి రూ.50లక్షలతో ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్లో శిల్పారామం, రవీంద్రభారతి లాంటి ఆడిటోరియం నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. మినీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్తో పాటు కబడ్డి, ఖోకో, వాలీబాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని, ఆయా క్రీడల్లో నిత్యం శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్వెజ్ భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.