మెదక్ అర్బన్, జూన్ 26: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. బుధవారం అంతార్జతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ బాలస్వామి, సీనియర్ సివిల్ న్యాయమూర్తితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంలోని గీతా హైస్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చుదామని పిలుపునిచ్చా రు. మాదక ద్రవ్యాల నివారణకు చట్టాలు కఠినంగా ఉన్నాయని, యంత్రాంగం పక్కా గా అమలు చేయాలని కోరారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ…మత్తుకు అలవాటు పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని కోరారు. ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ…డ్రగ్స్పై పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు ఎవ రూ బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్ విడుదల చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్చంద్రగౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.