చేర్యాల, జూన్ 28 : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పాటు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ ఆలయంలో మూడేండ్లుగా ఇన్చార్జి ఈవో పాలన కొనసాగుతున్నది. రానున్న డిసెంబర్లో మల్లన్న కల్యాణోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముం దస్తుగా ప్రారంభించాల్సిన పనులకు అతీగతి లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఎక్కడా లేనివిధంగా కొమురవెల్లి క్షేత్రంలో మూడు నెలల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో ప్రతి ఆదివారం సుమారు 50 నుంచి 60 వేల మంది భక్తులు, ప్రతి బుధవారం 25 నుంచి 40వేల మంది భక్తులు దర్శించుకుంటారు. రెగ్యులర్ ఈవోను నియమించక పోవడంతో ఆలయ అభివృద్ధి పనులే కాకుండా భక్తులకు సేవలు సరిగ్గా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత ఇన్చార్జి ఈవో బాలాజీ మూడేండ్లుగా సమర్థవంతంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన హైదరాబాద్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన 10 రోజుల్లోనే కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం రావడంతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఉత్సవానికి హాజరయ్యారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు అమ్మవార్లు(బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ)లకు బంగారు కిరీటాలు తయారు చేయించి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దేవాదాయశాఖ మంత్రి హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో కిరీటాలు తయారు చేసేందుకు కావాల్సిన బంగారం లాకర్లలో మగ్గుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ఆనాడు మంత్రి హరీశ్రావు ఇచ్చిన హామీ మేరకు మల్లన్న స్వామికి వెండి సింహాసనం, బంగారు కిరీటం చేయించి కల్యాణోత్సవం రోజున అందించి హామీ నెరవేర్చి భక్తుల మన్ననలు పొందారు. కాంగ్రెస్ పాలనలో అమ్మవార్లకు ఇచ్చిన బంగారు కిరీటం హామీ నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సి సమయం ఆసన్నమైంది.రెగ్యులర్ ఈవో స్థ్ధానికంగా ఉండి పనులు ప్రారంభిస్తే డిసెంబర్ మూడో వారంలో ప్రారంభమయ్యే కల్యాణోత్సవానికి బంగారు కిరీటం రెడీ అయ్యే అవకాశం ఉంటుంది.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.12 కోట్లతో అత్యాధునిక క్యూలైన్ నిర్మాణ పనులు, రూ.10 కోట్లతో 50 కాటేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఉపయోగపడే ఈ రెండు పనులు బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తే భక్తులకు ఉపయోగకరం గా ఉంటుంది.కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఆలయ ఉద్యోగుల మధ్య గొడవలు, పోలీస్స్టేషన్లలో కేసులు, పెండింగ్లో అభివృద్ధి పనులు, స్వామివారి కల్యాణోత్సవం సమీపిస్తుండడంతో రెగ్యులర్ ఈవో అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఉద్యోగుల మధ్య సమన్వయం, అభివృద్ధి పనులు పూర్తి చేయడం, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు వసతులు కల్పించేందుకు రెగ్యులర్ ఈవో ఉంటే బాగుంటుందని అందరూ కోరుతున్నారు. రెగ్యులర్ ఈవోను నియమిస్తేనే మల్లన్న క్షేత్రంలో పరిపాలన గాడిన పడడంతో పాటు అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.