సిద్దిపేట, జూన్ 26: మాదక ద్రవ్యాలను నిర్మూలించి భావితరాలకు డ్రగ్స్ రహిత సమాజాన్ని అందిదామని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిపేటలో వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి పట్టణంలోని నూతన బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ అంబేదర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు పోలీసు కమిషనర్ కార్యాలయంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి, వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడంతో మానసిక స్థితి కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందని, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు ‘డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు అనే’ అంశంపై పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, పెయింటింగ్ పోటీల విజేతలకు అంబేదర్ చౌరస్తా వద్ద నిర్వహించిన సమావేశంలో సీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.పట్టణంలోని అంబిటస్ పాఠశాల విద్యార్థిని ఆర్. .వర్షశ్రీ వ్యాసరచన పోటీలో మొదటి స్థానంలో నిలిచినందుకు సీపీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీ మధు, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసమూర్తి, సీఐలు విద్యాసాగర్, లక్ష్మీబాబు, ఉపేందర్, రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, రూరల్ ఎస్సై అపూర్వరెడ్డి, పోలీసు, భరోసా సెంటర్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.