సిద్దిపేట అర్బన్, జూలై 1: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్కు మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు నిరసన తెలిపారు. వీ వాంట్ జస్టిస్, గ్రూప్స్ పోస్టులు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో డీఎస్సీ రాసే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని, చదువుకునేందుకు కనీసం 3 నెలల సమ యం ఇవ్వాలన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3 వేలు ఉద్యోగాలు కలుపాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించని పక్షం లో పెద్ద ఎత్తు న ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.