సంగారెడ్డి జనవరి 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్-2024 టెక్నో ఫెయిర్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మెగా టెక్నో ఫెయిర్ను ప్రారంభించారు. టెక్నో ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, పాలకవర్గ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్మూర్తి, ఐఐటీ డీన్ చంద్రశేఖర్ శర్మ, సూర్యకుమార్ పాల్గొన్నారు. ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభించన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ మాట్లాడుతూ రెండో విడత ఇన్వెంటివ్ టెక్నోఫెయిర్ ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 53పైగా సాంకేతిక విద్యాసంస్థలు టెక్నోఫెయిర్లో పాల్గొని 120 కొత్త ఆవిష్కరణలు ప్రదర్షించటం అభినందనీయమన్నారు. టెక్నో ఫెయిర్తో పారిశ్రామికవేత్తలు పరిశోధన రంగంలో మరింత పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర కేంద్ర సాంకేతిక విద్యాసంస్థలు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించారు.
టెక్నో ఫెయిర్లో ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ ఇతర సాంకేతిక విద్యాసంస్థల పరిశోధకులు, విద్యార్థులు ఆవిష్కరణలను ప్రదర్శించారు. వైద్యం, వ్యవసాయం-ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ-అంతరిక్షం, పరిశ్రమలు-వాతావరణ మార్పులు, సుస్థిరమైన టెక్నాలజీ అంశాల్లో 53 సాంకేతిక విద్యాసంస్థలు 120 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. సైయంట్, హానీవెల్, ఐప్లెడ్ మెటీరియల్స్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, ఐసీఐసీఐ, సినర్టీ, సన్ఫార్మా, సుజుకి మోటర్స్, బాష్, ష్నైడర్ ఎలక్ట్రికల్స్, ఎన్టీపీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. రక్షణ శాఖ అధికారులు, డీఆర్డీవో, డీఆర్ఎల్ తదితర సంస్థల ప్రతినిధులు టెక్నోఫెయిర్కు హాజరయ్యారు. మెగా టెక్నోఫెయిర్కు 23మంది ఐఐటీ డైరెక్టర్లు, ఎన్ఐటీ డైరెక్టర్లు, ఐఐఐటీ డైరెక్టర్లు, ప్రొఫెసర్లు హాజరయ్యారు.
ఐఐటీ గౌహతికి చెందిన సాహిల్ బృందం రూపొందించిన ‘మోబి ల్యాబ్’ పరికరంతో ఇంటి వద్ద 25 రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు. మోబిల్యాబ్ పరికరాన్ని ఎక్కడికైనా వెంట తీసుకెళ్లవచ్చు. ఫలితాలను వెంటనే మొబైల్ స్క్రీన్పై తెలుసుకోవచ్చు. దీని విలువ రూ.5 లక్షల వరకు ఉంటుంది. కిడ్నీ, లివర్, డయాబెటిక్ ఇతర పరీక్షలు ఇంటివద్దే చేసుకోవచ్చు. ఫలితాలు కచ్చితంగా ఉంటాయి.
పది నిమిషాల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ను గుర్తించేలా ఐఐటీ గోవాకు చెందిన డాక్టర్ బిదన్ ప్రమానిక్ బృందం అధునాతన సెన్సార్ ఆధారిత పరికరాన్ని రూపొందించింది. ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్ గుర్తించాలంటే వేర్వేరు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రోగ నిర్థారణ పరీక్ష ఫలితాలు తెలుసుకునేందుకు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. పది నిమిషాల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ను గుర్తించే సెన్సార్ ఆధారిత పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంలో రక్తం నమూనాలు వేసిన పది నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. దీంతోపాటు కోవిడ్ రోగ నిర్థారణ ఫలితాన్ని 20 నిమిషాల్లో, హైపటైటీస్ రోగ నిర్ధారణ ఫలితాన్ని 20 నిమిషాల్లో తెలుసుకోవచ్చు.
నీటి వృథాను అరికట్టి పొగమంచుతో మొక్కలను పెంచే నూతన టెక్నాలజీని వీఐటీ వెల్లూరుకు చెందిన నరేంద్ర వర్మ బృందం అభివృద్ధి చేసింది. పొగమంచు ద్వారా మొక్కలను పెంచే ఫాగ్పోనిక్స్ యంత్రాన్ని తయారుచేశారు. మొక్కలకు అవసరమైన నీటిని, ఖనిజాలను పొగమంచు రూపంలో అందజేస్తారు. నీరు ఆదాతోపాటు మొక్కలకు చీడపీడలు సంక్రమించవు. తక్కువ సమయంలో మిర్చి, ఆలుగడ్డ, పూలు పండించొచ్చని ఆవిష్కర్త నరేంద్రవర్మ తెలిపారు.
మూత్రం నుంచి ఫర్టిలైజర్ తయారు చేసే కొత్త టెక్నాలజీని ఐఐటీ పాలక్కాడ్కు చెందిన డాక్టర్ ప్రవీణ్ బృందం అభివృద్ధి చేసింది. మనుషులు విసర్జించే మూత్రాన్ని శుద్ధిచేసి అమ్మోనియం పాస్పెట్ ఫర్టిలైజర్ తయారు చేసే రియాక్టర్(ఎలక్ట్రో కెమికల్ రీసోర్స్ రికవరీ రియాక్టర్)ను తయారు చేసింది. ఈ రియాక్టర్ 7.5 లీటర్ మూత్రం నుంచి 15 గ్రాముల అమోనియమ్ పాస్పెట్ ఫర్టిలైజర్ను తయారు చేస్తుంది. పాలక్కాడ్ అభివృద్ధి చేసిన రియాక్టర్తో కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంటుతో లైట్లు వెలిగించడంతోపాటు ఫోన్లు చార్జింగ్ చేసుకోవచ్చు.
కృత్రిమ మేధను ఉపయోగించి ట్రాఫిక్ను నియంత్రించే రియల్ టైమ్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఐఐటీ రూర్కీకి చెందిన అమిత్ అగర్వాల్ బృందం అభివృద్ధి చేసింది. మెట్రోపాలిటన్ సిటీలు, ఇతర పట్టణాల్లో ప్రస్తుత ట్రాఫిక్కు దృష్టిలో ఉంచుకుని జెట్సన్ జేవియర్ ఎన్ఎక్స్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మేధతో పనిచేసే ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను రూపొందించారు.
రోగనిరోధక శక్తి పెంచే
మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన క్యాప్సల్స్ను ఎన్ఐటీ నాగ్పూర్కు చెందిన ప్రొ.అనుపమాకుమార్, నృపుర్ శ్రీవివాస్తవ, మనీషాశర్మ బృందం అభివృద్ధి చేసింది. పండ్లు, కూరగాయల పొట్టు నుంచి వేర్వేరు ప్రక్రియల ద్వారా యాంటాక్సిడెంట్లు, గ్యాలిక్ ఆసిడ్ను వేరు చేసి వాటితో న్యూట్రా సూటికల్స్ క్యాప్సల్స్ను తయారు చేశారు. వీటిని వినియోగించడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. బంగాళాదుంప, దానిమ్మ పండ్ల పొట్టును ఉపయోగించి న్యూట్రా సూటికల్స్ క్యాప్సల్స్ను ఎన్ఐటీ నాగ్పూర్ అభివృద్ది చేసింది. మరిన్ని కూరగాయల పొట్టు నుంచి ఈ క్యాప్సల్స్ తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
వృథా నీటి నుంచి లిక్విడ్ యూరియాను తయారు చేసే సాంకేతిక పరికరాన్ని ఐఐటీ తిరుపతికి చెందిన ప్రొఫెసర్ షిహాబుద్ది బృందం అభివృద్ధి చేసింది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యకారక జలాలను ఫ్లాస్మా టెక్నాలజీతో శుద్ధి చేస్తారు. ఇలా శుద్ధిచేసిన జలాల నుంచి ప్రత్యేక పద్ధతితో నాన్థర్మల్ అట్మాస్పియరిక్ ఫొటో ప్లాస్మాను అభివృద్ధి చేసి లిక్విడ్ నైట్రేట్ను తయారు చేస్తారు. దీన్ని మొక్కలకు యూరియాలా వాడవచ్చు. లిక్వడ్ యూరియా వాడడంతో దిగుబడి పెరిగి పంట సాగు సమయం తగ్గుతుంది.
మహిళలకు మేలు చేసే సెల్యులాయిస్ నానోఫైబర్ శానిటరీ ప్యాడ్స్ను ఐఐటీహెచ్కు చెందిన డాక్టర్ చంద్రశేఖర్శర్మ, అమాన్ ఫాతిమా బృందం రూపొందించింది. ప్రస్తుతం లభించే శానిటరీ ప్యాడ్స్ను కాటన్, పాలిస్టర్ ఇతర మెటీరియల్తో తయారు చేస్తున్నారు. ఫర్టిలిటీ, చర్మ సమస్యలు, ఇతర హానికారక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని అరికట్టేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సెల్యోలాయిస్ నానో ఫైబర్ను ఉపయోగించి తేలికపాటి శానిటరీ ప్యాడ్స్ను రూపొందించారు.
కార్-టీ సెల్ థెరపీతో బ్లడ్క్యాన్సర్కు చెక్ పెట్టేలా కొత్త చికిత్సను ఐఐటీ బాంబేకు చెందిన డా.రాహుల్ పుర్వార్, అలియాఖాన్, స్వీటీ ఆసిజా బృందం కొనుగొన్నది. బ్లడ్క్యాన్సర్ సమస్య ఉన్నవారికి పలుమార్లు శుద్ధిచేసిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కార్-టీ సెల్ థెరపీలో రోగి నుంచి సేకరించిన రక్త కణాల నుంచి కొత్త కార్టీ సెల్స్ను అభివృద్ధి చేస్తారు. సెల్స్ను శుద్ధిచేసిన రక్తంలోకి చేర్చి రోగికి ఎక్కిస్తారు. దీంతో బ్లడ్క్యాన్సర్ సమస్య పూర్తిగా సమసిపోయి, మళ్లీ శుద్ధిచేసిన రక్తం రోగులకు ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఈ చికిత్స అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. బ్లడ్క్యాన్సర్ చెక్ పెట్టే చికత్స మన దేశంలోనూ త్వరలో అందుబాటులోకి రానున్నది.