అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేస్తున్నది. ఇటీవల ఎండలకు నీళ్లు లేక పంటలను ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న రైతులకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కన్నీటి బాధలు విగుల్చుతున్నాయి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’.. అన్న చందంగా కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలతో సాగుకు ఇబ్బంది పడుతున్న కర్షకులపై ఈ నష్టం వారిని అప్పుల్లోకి నెట్టివేసింది..
సిద్దిపేట, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్న మొన్నటి వరకు అప్రకటిత కరెంట్ కోతలు, భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయాయి. ఈదురు గాలులు, అకాల వర్షాలతో రెండు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో వడగండ్ల రూపంలో పంటలు దెబ్బతినడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. యాసంగి పంటను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు చేసి రక్షించుకుంటున్నారు. నీళ్లు లేక, వచ్చిపోయే కరెంట్తో మోటర్లు కాలడం తదితర ప్రతికూల పరిస్థితుల మధ్య రైతులు కొట్టు మిట్టాడుతున్నారు. ఇదే సమయంలో వడగండ్ల వానతో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి తోటలతో పాటు ఇతర పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రైతుల పంటల నష్టం అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో వర్షం పడింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం పడింది. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి, చిన్నశంకరంపేట, రామాయంపేట, నార్సింగి, చేగుంట మండలాల్లో కురిసిన వడగండ్లకు పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాల్లో చేతి కొచ్చే పంట అందకుండా పోయింది. తక్షణమే వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈసారి యాసంగి సాగు ఆరంభం నుంచి రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించేవారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధు ఇవ్వలేదు. దీంతో రైతులు అప్పులు తెచ్చి పంటలు వేశారు. పంట చివరి దశలో సాగునీరు అందక, కరెంట్ కష్టాలతో పంటలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల పశువులు మేపుతున్నారు. ఎండిపోగా మిగిలింది చేతికి వస్తుందనుకుంటే వడగండ్ల రూపంలో పంటలకు నష్టం జరిగిందని, రైతులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం తమకు పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.