కొమురవెల్లి, ఆగస్టు 24:సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లోకి శనివా రం గోదావరి జలాలను విడుదల చేశారు. ఈనెల 22న చేర్యాల పట్టణంలో రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తపాస్పల్లి రిజర్వాయర్లోకి రెండు రోజు ల్లో నీళ్లు విడుదల చేయకుంటే పెద్దఎత్తున రైతులతో వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు తలొగ్గి నీటిని విడుదల చేశారు. పదేండ్లలో ఎప్పుడూ లేని విధంగా తపాస్పల్లి రిజర్వాయర్లో నీరు అడుగంటి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఎనిమిది నెలల తర్వాత మొట్టమొదటిసారి తపాస్పల్లి రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల చేయడం విశేషం.