సిద్దిపేట, జూలై 3: ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి సేవ చేయాలని, ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుదామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, నంగునూరు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీల సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటు వేసిన పాపానికి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయన్నారు. పదవి విరమణ అనేది ప్రజాసేవకు కాదన్నారు. నాయకులు అంటేనే నిరంతరం ప్రజల మధ్య ఉండే వారని, పదవి లేకపోయినా, మనం పదవిలో ఉన్నప్పుడు ఎంత బాగా పనిచేశామన్నదే శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ప్రజల సాకారంతో ఐదేండ్లలో చరిత్రలో నిలిచిపోయే పనులెన్నో చేశారన్నారు.
ఐదేండ్లలో ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు కలిగిందన్నారు. మునుముందు మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పదవులున్నా లేకున్నా అందరికీ సమానమైన గౌరవం ఉంటుందని, అందరినీ కాపాడుకొని సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఐదేండ్లలో గ్రామాలకు గోదావరి జలాలు తెచ్చే సాగునీటి కల సాకారమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పచ్చని చెట్లు స్వాగత తోరణాలుగా స్వాగతం పలికేవన్నారు. నేడు ఏ గ్రామానికి వెళ్లినా చెత్త కుప్పలు స్వాగతం పలుకుతున్నాయని హరీశ్రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయని, కాలిపోయిన మోటర్లు, ఇన్వర్టర్ల కాలం వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, ప్రాధాన్యత లేని పాలనగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా మంజూ రు చేయలేదన్నారు. పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు సొంత డబ్బులతో పాలన లాకొస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వారు కూడా చేతులెత్తేయడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ జరగటం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి భరోసా ఉండేదని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. 24 గంటల కరెంట్, కాలంతో పనిలేకుండా కాళేశ్వరం నీళ్లతో పంట వేసుకుందామనే నమ్మకం రైతు ల్లో ఉండేదన్నారు. ఇప్పుడు రైతులు పంటలు వేస్తే నీళ్లు రావనే ఆందోళనలో ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా, రైతన్నలకు ఎరువులు, రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా కోత విధించేందుకు ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హరీశ్రావు ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ముచ్చటే లేదన్నారు. సరార్ దవాఖానల్లో మందులు లేక బయట మెడికల్ షాపులకు చిట్టీలు రాస్తున్నారు. కసీఆర్ కిట్టు, న్యూట్రీషన్ కిట్టును బంద్ పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లేరని, వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. ప్రతి ఒకరూ ప్రజల్లో ఉండి సేవ చేస్తే మళ్లీ మీరే గెలిసి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉన్నదని హరీశ్రావు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీదేవీచందర్రావు, ఒగ్గు బాలకృష్ణ, జడ్పీటీసీలు శ్రీహరి గౌడ్, కుంభాల లక్ష్మీ రాఘవరెడ్డి, ఉమా వెంకటరెడ్డి, నాయకులు తుపాకుల బాల్ రంగం, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, ప్రభాకర్ వర్మ, కిష్టారెడ్డి, అల్లం ఎల్లం, సంగు పురేందర్, కోల రమేశ్గౌడ్, దువ్వల మల్లయ్య, నారా గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు