చిన్నకోడూరు, జూలై 1: గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు పెడితేనే గ్రామాల్లో కార్మికుల జీతాలు, ట్రాక్టర్ డీజిల్, వీధి దీపాలు వెలిగే దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సోమవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో వైస్ఎంపీపీ కీసరి పాపయ్య అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి హరీశ్రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామా ల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చిస్తే తప్పా పాలన ముందుకు కొనసాగే పరిస్థితి లేదన్నారు. పంచాయతీ కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు వేలల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రతినెలా గ్రామ పంచాయతీకి నిధులు విడుదల కావడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులకు వచ్చే జీతాలకు అదనంగా ఖర్చులు పెడుతున్నట్లు హరీశ్రావు తెలిపారు. వర్షాకాలంలో పారిశుధ్యం లోపించకుండా ఉండాలంటే బ్లీచింగ్ తదితర వస్తువులు కొనుగోలు చేయాలంటే డబ్బులు లేని పరిస్థితి ఉందన్నారు. నెల రోజుల నుంచి గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడిందన్నారు. వృద్ధులకు రెండు నెలల పెన్షన్, మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు బంద్ చేశారని చెప్పారు.
వానకాలంలో రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులుకు సూచించారు. కాం ప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని లింకు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు సాగుకు ముందే రైతుల ఖాతాలో జమయ్యేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సాధారణ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వరి నాట్లు వేసే టైంకు విత్తనాలు వస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. విత్తనాలు దొరక్క రైతులు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రతి ఊరికి రెండు యూరియా లారీలు పంపించాలన్నారు. పదేండ్లు రైతులకు ఎరువులు ఏ విధంగా సరఫరా చేశామో.. అదేవిధంగా అందించాలన్నారు. ఆయిల్పామ్ సాగు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి. కాళేశ్వరం నీళ్లు వస్తాయా రావా అనే సందిగ్ధంలో రైతులు భయంతో వరి నాట్లు వేయడంలో వెనుక ముందు అవుతున్నారని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకానికి డీడీలు కట్టిన రైతులకు వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. అడవి జంతువుల దాడిలో మరణించిన గొర్రెలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలతోపాటు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రం, జిల్లాలో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయ బృందానికి మండల సభ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సొంత ఖర్చులతో త్వరలో ఐప్యాడ్ అందించి సన్మానిస్తామని హరీశ్రావు అన్నా రు. అనంతరం ఐదేండ్లు పూర్తి చేసుకున్న ఎంపీటీసీలను ఎమ్మెల్యే హరీశ్రావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, ఎంపీడీవో, పీవోపీఆర్డీ, వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజాసేవకు పదవి విరమణ ఉండదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఐదేండ్లలో కాళేశ్వరంతో గ్రామాల్లోని చెరువులు నింపి రెండు పంటలకు నీళ్లు అందించామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో ఎన్నో మంచి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రజల జీవనాధారాన్ని, పల్లెల ముఖచిత్రాన్ని మార్చేది సాగునీరేనన్నారు. మనఊరు మనబడితో పాఠశాలలు బాగుపడ్డాయని, సీసీ రోడ్డు వందశాతం పూర్తి చేశామన్నారు. అన్ని గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. మళ్లీ మీరందరూ గెలువాలని, భవిష్యత్తులో మీకు పెద్ద పదవులు రావాలని, మీ కష్టం వృథా కావద్దన్నారు. మీ అందరికీ వ్యక్తిగతంగా, రాజకీయంగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదు, జీవితంలో తృప్తి అనేది ఉంటుందన్నారు. మనం చేసిన మంచి పనులు, మనం తెచ్చుకున్న పేరు ఎప్పటికీ నిలబడుతుందని, మనందరం కలిసి పని చేద్దామన్నారు. మీరు ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఎదిగే అవకాశం ఉంటుందని, ఇంకా మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలని హరీశ్రావు సర్పంచులు, ఎంపీటీసీలకు సూచించారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మేలు కోసం పని చేస్తామని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు సహకారంతో చిన్నకోడూరు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చామన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మేలు కోసం పని చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు.