మద్దూరు(ధూళిమిట్ట)/నంగునూరు, జూన్30: సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా మూడు ‘పూలు..ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి, నంగునూరు మండల కేంద్రంతో పాటు ఖాతా, అక్కెనపల్లి, ఘణపూర్ గ్రామాల్లోని మోయతుమ్మెద వాగు నుంచి పెద్ద ఎత్తున కొంతమంది ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాగు నుంచి అడ్డదిడ్డంగా ఇసుకను తోడేస్తుండడంతో వట్టిపోతోంది. మోయతుమ్మెదవాగు నుంచి రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. జాలపల్లిలో సుమారు 15 నుంచి 20, నంగునూరులో 70 నుంచి 100, ఖాతా నుంచి 30 ట్రాక్టర్ల ద్వారా సిద్దిపేట, చేర్యాల పట్టణాలతో పాటు వివిధ గ్రామాలకు ఇసుకను రవాణా చేసి ట్రాక్టర్ యజమానులు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 6 వేల నుంచి రూ. 10వేల వరకు సంపాదిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కొంతమంది ఇసుక మాఫియాగా ఏర్పడి దందాను కొనసాగిస్తున్నారు. ఇసుక దందాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. గతంలో ఇసుక దందాను అడ్డుకునేందుకు వెళ్లిన కొంతమంది పోలీసు అధికారులపైకి దాడికి యత్నించారు.
మోయతుమ్మెద వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తవ్వి కొంతమంది పెద్ద ఎత్తున ఇసుకను డంపు చేస్తున్నారు. వర్షాకాలంలో వాగు నుంచి ఇసుకను తరలించే పరిస్థితులు ఉండవు కాబట్టి ట్రాక్టర్ యజమానులు గ్రామాల్లో ముందు చూపుతో ఇసుకను వివిధ చోట్ల డంప్ చేస్తున్నారు. కొంతమంది వ్యవసాయ బావుల వద్ద డంపు చేస్తే మరికొంతమంది తమ ఇండ్ల వద్ద ఇసుకను డంపుచేస్తున్నారు. ఇటీవల కాలంలో నంగునూరు, జాలపల్లి గ్రామాల్లో డంపుచేసిన ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకకు రెవెన్యూ అధికారులు సైతం వేలం పాట నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుక డంపులను వేలంలో దక్కించుకున్న వారు ఇదే అదునుగా భావించి, అనుమతుల పేరిట ఇసుకదందాను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నంగునూరు, జాలపల్లి, ఖాతా గ్రామాల్లో ఇసుక దందా కొనసాగడానికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా అధికారులకు అమ్యామ్యాలు ఆశ చూపి వారి దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు సహకరిస్తున్నారనే విష యం కూడా నిఘా వర్గాల ద్వారా ఉన్నతాధికారులకు వెళ్లినట్లు సమాచారం. సదరు అధికారులను కూడా ఉన్నతాధికారులు మందలించారు. వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించడంతో భూగర్భజలాలు తగ్గడమే కాకుండా వాగు సమీపంలో ఉన్న వ్యవసాయపొలాలు కోతకు గురవుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు వందలసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాగు సమీపంలోని కర్షకులు వాపోతున్నారు. అధికారుల అండదండలకు తోడు అధికార పార్టీ నాయకులు కూడా ఇసుక అక్రమ దందాకు సహకరిస్తున్నా రు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, లేకపోతే ఈ ప్రాంత రైతులకు వరప్రదాయినిగా పిలువబడే మోయతుమ్మెద వాగు వట్టిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.