మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 30: గ్రామాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది రైతులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పాలకేంద్రాల్లో రోజూ పాలు పోసి నెల నెలా బిల్లులు తీసుకొని ఉపాధి పొందుతున్న పాడి రైతులకు రెండు నెలలుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వానకాలం సాగు పనులు ముమ్మరం అవుతున్న వేళ ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయా న్ని అందించకపోగా ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ రైతులకు రావాల్సిన పాల బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా మద్దూ రు మండలంలోని లద్నూర్ విజయ పాలకేంద్రంలోనే సుమారు 200 మంది పాడి రైతులు రోజూ వెయ్యి నుంచి 12వందల లీటర్ల పాలు పోస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా సుమారు రూ. 8లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే రెండు నెలలుగా పాల బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకొని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు రైతులను నిర్లక్ష్యం చేస్తుందనే దానికి పాల బిల్లులు చెల్లించకపోవడమే నిదర్శనమని పాడిరైతులు విమర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం దేవుడెరుగు తమకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తే చాలని లద్నూర్ పాలకేంద్రం చైర్మన్ రాపాక బుచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.